రోహింగ్యాలకు షాక్: మయన్మార్కు మీరు వెళ్లిపోవాల్సిందే అని సుప్రీం తీర్పు
ఢిల్లీ: అక్రమంగా భారత్లోని అస్సోంలోకి ప్రవేశించిన ఏడుమంది రోహింగ్యాలను తిరిగి మయన్మార్కు పంపించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. రోహింగ్యాలు మయన్మార్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించారని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. మరోవైపు ఆ ఏడుగురు మయన్మార్ దేశపౌరులే అని ఆ దేశం అంగీకరించింది. ఈ ఏడుగురు మయన్మార్ దేశ పౌరులే అని ఆ దేశం వెల్లడించడంతో ఇక వీరు మయన్మార్కు వెళ్లడమే మంచిదని ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
న్యాయస్థానం ముందు కేంద్రం వాదనలు వినిపించింది. రోహింగ్యాలు 2012లో అక్రమంగా భారత్లోకి ప్రవేశించారని వారిపై విదేశీ చట్ట ఉల్లంఘన కింద కేసులు కూడా నమోదు చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. వారిని రోహింగ్యాలుగా గుర్తిస్తూ మయన్మార్ ప్రభుత్వం సర్టిఫికేట్ కూడా పంపినట్లు కోర్టుకు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఒక నెల వీసాను జారీ చేస్తూ ఆ తర్వాత వారిని మయన్మార్ పంపిస్తామని పేర్కొంది. దీంతో కేసును విచారణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ల ధర్మాసనం వారిని మయన్మార్ పంపించేందుకు అనుమతి ఇచ్చింది.
బుధవారం రోజున రోహింగ్యాలను మయన్మార్కు తరలించకుండా ఆపాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. వారని అస్సోంలోని సిల్చార్లో నిర్భంధించింది కేంద్రం. గురువారం రోజున మణిపూర్ మయన్మార్ సరిహద్దు అయిన మోరే పోస్టు వద్ద మయన్మార్ అధికారులకు వారిని అప్పగించనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం తెలిపింది. అంతకుముందే ఇద్దరు రోహింగ్యా వలసదారులు మొహ్మద్ సలీముల్లా, మొహ్మద్ షకీర్లు కేంద్రం 40వేల మంది శరణార్థులను మయన్మార్కు తరలించే ప్రయత్నం చేస్తోందంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రోహింగ్యాలపై వివక్ష చూపుతూ వారిపై దాడులు చేస్తున్న నేపథ్యంలో మయన్మార్ను వీడి పొట్టచేత పట్టుకుని భారత్కు చేరుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.