కండీషన్స్ అప్లై: డ్యాన్స్ బార్లు నిర్వహించుకోవచ్చని సుప్రీం తీర్పు కానీ...
మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లకు లైసెన్సులు పొందేందుకు కఠిన నిబంధనలు విధిస్తూ ఫడ్నవీస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బార్ల యాజమాన్యానికి సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో బార్లు నృత్యాలు నిర్వహించుకోవచ్చని చెబుతూనే వాటిని రాష్ట్రప్రభుత్వం నిషేధించడం సరికాదని అభిప్రాయపడింది.
డ్యాన్సర్లకు టిప్పులు ఇవ్వొచ్చు
బార్లలో మహిళలు నృత్యాలు చేసుకోవచ్చని తీర్పుచెప్పిన కోర్టు... ఇందుకు కొన్ని కండీషన్స్ విధించింది. బార్లలో మహిళలు చేసే డాన్స్కు టిప్పు రూపంలో డబ్బులు ఇవ్వొచ్చని అయితే వారు నృత్యం చేస్తుండగా కరెన్సీ నోట్లు వారిపైకి వెదజల్లరాదని పేర్కొంది. అంతేకాదు డ్యాన్స్ చేస్తున్న మహిళలకు యాజమాన్యం మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలని కోర్టు వెల్లడించింది. అంతేకాదు బార్ డ్యాన్సర్లకు నెలవారీ వేతనం అవసరం లేదని పేర్కొంది.
డ్యాన్స్ బార్లపై కఠిన నిబంధనలు తీసుకొచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
ఇక కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే హోటళ్లలో, రెస్టారెంట్లలో, బార్ రూములలో మహిళల మనోభావాలు దెబ్బతినేలా కొందరు యువతులు నాట్యం చేస్తుండటాన్ని తప్పుబడుతూ కఠిన చట్టం మహాసర్కారు తీసుకువచ్చింది. మహిళల మనోభావాలు కించపర్చేలా నృత్యాలు ఉంటే బార్ లైసెన్సులు రద్దు అవుతుందని చట్టంలో పేర్కొంది. ఈ చట్టం ఆధారంగా చేసుకుని అధికారులు రెచ్చిపోతున్నారని బార్ యజమానులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఒకే మైండ్సెట్తో చూసేవారికి మంచి నృత్యం కూడా అసభ్యంగానే కనిపిస్తుంది
పిటిషన్ను జస్టిస్ ఏకే సీక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న అన్ని దరఖాస్తులను తిరస్కరించడం సరికాదని అభిప్రాయపడింది. బార్లలో మహిళలు అసభ్య నృత్యాలు చేస్తున్నారన్న అపోహతో మాత్రమే పోలీసులు ఉన్నారని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకే మైండ్సెట్తో చూసే వారికి నృత్యాలు అసభ్యకరంగా లేనప్పటికీ అసభ్యకరంగానే కనిపిస్తాయని చెప్పారు. 2005 నుంచి ఒక్క బార్ లైసెన్సు కూడా ప్రభుత్వాలు జారీచేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాలు నిషేధం
మరోవైపు ప్రార్థనా స్థలాలకు ఒక కిలోమీటరు పరిధిలో బార్లు ఏర్పాటు చేయరాదని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. రాత్రి 11:30 గంటల వరకే బార్లు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఆ సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బార్లు తెరిచి ఉంచరాదని చెప్పిన కోర్టు... ఒకవేళ నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేకాదు బార్లలో సీసీ టీవీ కెమెరాలు కూడా అమర్చవలసిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. సీసీ కెమెరాలతో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.