10 శాతం రిజర్వేషన్లపై స్టేకు సుప్రీం కోర్టు నో, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు
న్యూఢిల్లీ: పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. పేదలకు ఇటీవల పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించరాదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు.
ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. మూడు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే, రిజర్వేషన్లపై స్టే విధించేందుకు నిరాకరించింది.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ల పైన విచారణ చేపట్టింది. విద్య, ఉద్యోగాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది. దీనినే సవాల్ చేస్తూ యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు సుప్రీం కోర్టు ఆశ్రయించారు.