బాణసంచాకు ఓకే కానీ: సుప్రీం షరతులు, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్లలో ఆ టైంలోనే కాల్చాలి
న్యూఢిల్లీ: బాణసంచా కాల్చడానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం నాడు టపాసులు కాల్చడంపై తీర్పు చెప్పింది. బాణసంచాను పూర్తిగా నిషేధించలేమని స్పష్టం చేసింది. టపాసుల అమ్మకాలపై నియంత్రణ అవసరమని చెప్పింది. కాలుష్య రహిత టపాసులు అమ్మేలా చూడాలన్నారు.
లైసెన్స్ ఉన్నవారే టపాసులు అమ్మాలని షరతు విధించింది. బాణసంచా కాల్చే సమయంపై నిబంధనలు విధించింది. రాత్రి ఎనిమిది గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చాలని చెప్పింది. దీపావళి రోజు ఈ రెండు గంటల సమయంలో బాణసంచా కాల్చాల్సి ఉంటుంది. ఈ నిబంధన అన్ని మతాలకు, అన్ని సందర్భాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
క్రిస్మస్ రోజున అర్థరాత్రి గం.11.55 నిమిషాల నుంచి గం.12.30 వరకు కాల్చవచ్చునని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అర్ధరాత్రి పన్నెండు గంటలకు కాలుస్తారు కాబట్టి, 35 నిమిషాల సమయం ఇచ్చింది. అలాగే, కొత్త సంవత్సరం రోజున అర్ధరాత్రి గం.11.45 నుంచి గం.12.45 వరకు గంటసేపు కాల్చవచ్చునని చెప్పింది. అలాగే, అన్ని మతాల పండుగలు అయినా లేదా వ్యక్తిగతంగా పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లు అయినా సుప్రీం కోర్టు ఆదేశాలు వర్తిస్తాయని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ప్రపంచంలోనే భారత దేశంలో ఎక్కువ కాలుష్య నగరాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కోంది.
దీపావళికి ముందు వారం రోజులు, తర్వాత వారం రోజులు వాయు కాలుష్యాన్ని సమీక్షించాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును సుప్రీం కోర్టు ఆదేశించింది. బాణసంచా తయారీదారులు అంతకుముందు సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ తయారీపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.