కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: దీపావళి పర్వదినం రోజున టపాకాయలు కాల్చే అంశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు దక్షిణాది రాష్ట్రాలకు కొంత వెసులుబాటు ఇచ్చింది. ఉదయం, లేదా సాయంత్రం ఎప్పుడైనా టపాకాయలు కాల్చుకునేందుకు న్యాయస్థానం ఒకే చెప్పింది. అయితే రెండు గంటలకు మించకూడదని తెలిపింది.
ఇటీవల కేవలం రాత్రి ఎనిమిది నుంచి పది గంటల మధ్య, కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలని సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఉదయం లేదా సాయంత్రం రెండు గంటలు టపాకాయలు కాల్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
బాణసంచాకు ఓకే కానీ: సుప్రీం షరతులు, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్లలో ఆ టైంలోనే కాల్చాలి
కాగా, బాణసంచా కాల్చడానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు టపాసులు కాల్చడంపై ఇటీవల తీర్పు చెప్పింది. బాణసంచాను పూర్తిగా నిషేధించలేమని స్పష్టం చేసింది.
టపాసుల అమ్మకాలపై నియంత్రణ అవసరమని చెప్పింది. కాలుష్య రహిత టపాసులు అమ్మేలా చూడాలన్నారు. లైసెన్స్ ఉన్నవారే టపాసులు అమ్మాలని షరతు విధించింది. అదే సమయంలో బాణసంచా కాల్చే సమయంపై నిబంధనలు విధించింది. రాత్రి ఎనిమిది గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చాలని చెప్పింది. ఇప్పుడు ఉదయం కూడా కాల్చుకోవచ్చునని చెప్పింది.