CLAT-2020: ఐసొలేషన్ కేంద్రాల్లో పరీక్షలు: కరోనా పాజిటివ్ అభ్యర్థుల కోసం: దేశవ్యాప్తంగా
న్యూఢిల్లీ: న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి ఉద్దేశించిన ఉమ్మడి పరీక్ష (క్లాట్) 2020లను ఐసొలేషన్ కేంద్రాల్లో కూడా నిర్వహిస్తున్నారు. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు క్లాట్ పరీక్షలు దేశవ్యాప్తంగా ఆరంభం అయ్యాయి. కరోనా వైరస్ బారిన పడిన అభ్యర్థులు కూడా పరీక్షలు రాయడానికి వీలుగా కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అభ్యర్థులు ఉన్న ఐసొలేషన్ కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తోంది.
ఐసొలేషన్ కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 22 న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి ఉద్దేశించిన క్లాట్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల ప్రారంభం అయ్యాయి. ఎల్ఎల్బీ, అయిదేళ్ల ఎల్ఎల్బీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు, ఎల్ఎల్ఎంలల్లో ప్రవేశాన్ని పొందడానికి ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ సోకిన అభ్యర్థులు తమ విలువైన ఏడాది కాలాన్ని కోల్పోకుండా ఉండటానికి వీలుగా సుప్రీంకోర్టు.. ఐసొలేషన్ కేంద్రాల్లోనూ ఆ పరీక్షలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది.
పరీక్షలు ఆరంభం కావడానికి రెండు గంటల ముందు దీనికి సంబంధించిన ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దీపాంశ్ త్రిపాఠి అనే విద్యార్థి దాఖలు చేసిన పిటీషన్పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దీపాంశ్ త్రిపాఠికి ఐసొలేషన్ కేంద్రంలోనే ప్రత్యేక గదిలో పరీక్షను రాయడానికి అనుమతి ఇవ్వాలని, ఇదే విధానం అందరికీ వర్తింపజేయాలని సూచించింది.
కరోనా వైరస్ సోకడ వల్ల అభ్యర్థులు తమ విలువైన విద్యాసంవత్సరాన్ని పోగొట్టుకోకూడదని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వారికి సహాయకారిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో వారు పరీక్షలను రాయడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూచించారు. జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో ఈ పరీక్షను కొనసాగించాలని సూచించారు. ఐసొలేషన్ సిబ్బంది క్లాట్ అభ్యర్థులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందజేస్తుండాలని, ప్రభుత్వ, లేదా ప్రైవేటు ఐసొలేషన్ కేంద్రాల్లో ఒకే తరహా విధానం ఉండాలని చెప్పారు.