బాధితులను కాపాడేవారిపై వేధింపులొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు మానవతా ధర్మంతో సహాయం చేసే వారిని పోలీసులు, ఇతర అధికారులు అనవసర వేధింపులకు గురి చేయకుండా కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు సుప్రీంకోర్టు బుధవారం ఆమోదం తెలిపింది. వీటికి విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించాలని జస్టిస్ వి. గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నిర్లిప్త భావం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. ఎక్కడ సాయపడితే ఇటు పోలీసులు, అటు అధికారుల వేధింపులకు గురవుతామేమోనన్న భయంతో ఎవరూ కూడా బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. కాగా, ఆపదలో ఉన్న తోటివారిని ఆదుకోవాలన్న సద్భావన కలిగినవారికి ఈ మార్గదర్శకాలు రక్షణ కవచంగా నిలుస్తాయి.
ఇలా ప్రమాదానికి గురైన వారిని ఆదుకునే వ్యక్తులు పోలీసుల వేధింపులకు గాని, అధికారుల వేధింపులకు గాని గురయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
సుప్రీం కోర్టు కూడా వీటికి విస్తృత ప్రచారం కల్పించాలని, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వీటికి కుట్టుబడి ఉండేలా చేయాలని కూడా కేంద్రాన్ని ఆదేశించింది. అన్నింటికీ మించి బాధితులకు సాయపడే వ్యక్తి వివరాలను చాలా గోప్యంగా ఉంచాలని కూడా ఈ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి.