మహిళలపై మీ మైండ్సెట్ మార్చుకోండి: కేంద్రానికి సుప్రీం చురకలు: ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్కు ఓకే
న్యూఢిల్లీ: సైన్యంలో శాశ్వత మహిళా కమిషన్ను ఏర్పాటు చేసే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వినిపించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టింది. మహిళలపై కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సి ఉంటుందని హితవు పలికింది. ఆర్మీలో మహిళలను నియమించడాన్ని సమర్థించింది. మహిళలను నియమించడాన్ని విప్లవాత్మక చర్యగా అభివర్ణించింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం
ఆర్మీలో మహిళల కోసం శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేయడానికి వీలుగా 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సవాల్ చేసింది. శాశ్వత మహిళా కమిషన్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీతలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్పై విచారణ నిర్వహించింది.
అప్పీల్ను కొట్టేసిన ధర్మాసనం..
2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే మంజూరు చేయాలంటూ కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తన వాదనలను వినిపించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పురుషులతో సమానంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించాల్సి అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికోసం శాశ్వత కమిషన్ ఉండి తీరాల్సిందేనని అభిప్రాయపడింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటీషన్ను కొట్టేసింది.
మహిళల పట్ల మైండ్సెట్ మార్చుకోవాలంటూ..
మహిళల శరీర తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం.. శాశ్వత కమిషన్ ఏర్పాటును నిరాకరించినట్లు కనిపిస్తోందని, ఈ విషయంలో తన మైండ్సెట్ మార్చుకోవాలని డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. పురుష ఉద్యోగులతో సమానంగా మహిళలకు కూడా అన్ని రకాల బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. వయస్సుతో పని లేకుండా.. పదవీ విరమణ చేసిన మహిళలకు కూడా పురుష ఉద్యోగులతో సమానంగా లబ్దిని చేకూర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది.
వయస్సుతో పని లేకుండా బెనిఫిట్స్..
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కింద ఎంపికైన మహిళా అధికారులు 14 సంవత్సరాలకు లోబడి ఉన్నా, పైబడి ఉన్నప్పటికీ.. వారికి శాశ్వత కమిషన్ను మంజూరు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేప్టెన్ తాన్యా షెర్గిల్, కేప్టెన్ మధుమిత సేవలను గుర్తు చేసింది. భౌగోళికపరంగా, వ్యూహాత్మకంగా అత్యంత సంక్లిష్టమైన లేహ్, ఉధమ్ నగర్ వంటి ప్రాంతాల్లో కమాండ్ యూనిట్ అధికారుణులుగా తాన్యా షెర్గిల్, మధుమిత అందించిన సేవలను సుప్రీంకోర్టు ఉటంకించింది.