రాజ్యాంగ విరుద్ధంగా ఏపీ హైకోర్టు ఆదేశాలు: తప్పు లేదన్న సుప్రీం: ఆ కేసులో హైకోర్టుకు డెడ్లైన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఉదంతంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ను సీజ్ చేయడం, హైకోర్టు అనుమతి లేకుండా ఎవరూ అందులోనికి అడుగు పెట్టకుండా చూడటం, సంస్థ డైరెక్టర్ల పాస్పోర్టులను స్వాధీనం చేసుకోవడం వంటి సంచలన ఆదేశాలను జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను శరవేగంగా ముగించాలని సూచించింది. ఈ వారం రోజుల్లో వ్యవధిలోనే పూర్తి చేయాలని పేర్కొంది. జాప్యం చేయడం సరికాదని అభిప్రాయపడింది.
త్రిసభ్య ధర్మాసనం విచారణ..
ఎల్జీ పాలిమర్స్ సంస్థను సీజ్ చేయడం, సంస్థ డైరెక్టర్ల పాస్పోర్టులను స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ ఇదివరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటీషన్లను దాఖలు చేసింది. ఈ పిటీషన్లు సోమవారం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం సమక్షానికి విచారణకు వచ్చాయి. న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, ఎంఎం శంతన గౌడర్, జస్టిస్ వినీత్ శరణ్ ఈ పిటీషన్లపై విచారణ చేపట్టారు. సుమారు గంట పాటు ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది.
ఎల్జీ పాలిమర్స్ తరఫున ముకుల్ రోహత్గీ..
ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఎల్జీ పాలిమర్స్ తరఫున వాదించారు. సంస్థకు చెందిన 30 మందిలో ఇద్దరికి మాత్రమే ఎల్జీ పాలిమర్స్ ఆవరణలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చేలా జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు ఉన్నాయని అన్నారు. కంపెనీలోకి వెళ్లే అవకాశాన్ని కల్పించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినా దాన్ని అమలు చేయట్లేదని అన్నారు. అత్యున్నత ప్రమాణాలతో, స్పెషలైజ్డ్గా నిర్మించిన ప్లాంట్ను మూసివేయాలని, దాన్ని సీల్ వేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధమని ముకుల్ రోహత్గీ వాదించారు.
ప్లాంట్ను సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదంటూ..
దీనికి జస్టిస్ లలిత్ సమాధానం ఇస్తూ.. తాము దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా భావించట్లేదని అన్నారు. ఆ ప్లాంట్ను మూసివేయడం సరైనదా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడు చర్చించదలచుకోలేదని తేల్చి చెప్పారు. గ్యాస్ లీక్ కావడం సంస్థ ఉత్పత్తిదారుల తప్పేనని స్పష్టం చేశారు. అనంతరం రోహత్గీ తన వాదనను కొనసాగిస్తూ.. ప్లాంట్ డైరెక్టర్ల పాస్పోర్టులను డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించడం సరికాదని అన్నారు. దేశాన్ని విడిచి పారిపోవడానికి వారేమీ నేరస్తులు కాదని చెప్పారు.
Recommended Video
ఈ వారంలోనే ముగించాలంటూ ఆదేశం..
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఉదంతంపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటీషన్లన్నీ ఎలా ఉన్నవి అలాగే ఉన్నాయని, వాటి విచారణలో కదలికలు కనిపించట్లేదని రోహత్గీ చెప్పారు. సెలవుల కారణంగా ఎల్జీ పాలిమర్స్కు సంబంధించి దాఖలైన పిటీషన్లను విచారణకు ఏపీ హైకోర్టు స్వీకరించట్లేదని అన్నారు. దీనిపై జస్టిస్ లలిత్ స్పందించారు. కేసు విచారణను వేగవంతం చేయాలని తాము ఏపీ హైకోర్టును కోరుతున్నామని చెప్పారు. ఈ వారంరోజుల వ్యవధిలోనే ఎల్జీ పాలిమర్స్ సంస్థ గ్యాస్ లీక్ ఉదంతంలో దాఖలైన అన్ని పిటీషన్లపై విచారణలను ముగించాలని సూచిస్తున్నామని అన్నారు.