నిషేధం?: ‘అద్దె గర్భం’ వ్యాపారంపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: అద్దె గర్భాల(సరోగసీ) వ్యాపారంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అద్దె గర్భం అమ్మకాలను అనుమతించరాదు, కానీ ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఇవి దేశంలో ఒక 'వ్యాపారం'గా నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
‘మీరు (ప్రభుత్వం) మానవ పిండాల వ్యాపారానికి అనుమతిస్తున్నారు' అని కేంద్రాన్ని నిలదీసింది. అద్దెగర్భం విక్రయాలతో ముడిపడిన వివిధ అంశాలపై న్యాయమూర్తులు రంజన్ గగోయ్, ఎన్వి రమణతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అద్దెగర్భం అమ్మకాలను చట్టం పరిధిలోకి తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.
అద్దెగర్భాన్ని విక్రయించిన సందర్భాల్లో అండాన్ని దానం చేసిన మహిళ మాత్రమే శిశువుకు తల్లి అవుతుందా? లేకపోతే అద్దెగర్భాన్ని ధరించిన, జన్యుపరమైన మహిళ ఇద్దరినీ తల్లులుగా భావించాలా? అనేదాన్ని స్పష్టం చేయాలని ఆదేశించింది.
అద్దెగర్భం తల్లుల కోసం విదేశీయులు పెద్దసంఖ్యలో వస్తున్నందున మనదేశం 'పిల్లల కర్మాగారం'లా మారిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.
కృత్రిమ గర్భధారణకు మానవ పిండాలను దిగుమతి చేసుకోవటానికి అనుమతిస్తూ కేంద్రం 2013లో జారీచేసిన నోటిఫికేషన్పై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. విదేశీయులు శీతలీకరించిన అండాలను భారత్కు తీసుకురావటానికి ఈ నోటిఫికేషన్తో వీలైంది. అద్దెగర్భాల నియంత్రణకు ప్రభుత్వం త్వరలోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనుందని సొలిసిటర్ జనరల్ రంజిత్కుమార్ ధర్మాసనానికి తెలిపారు.