NEET PG 2021 counselling: అది తేలేంత వరకు నిలిపివేయండి: మోడీ సర్కార్కు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి మోడీ సర్కార్కు షాక్ ఇచ్చింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ 2021 పరీక్షలకు సంబంధించి ఇదివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఇదే విషయంపై మరోసారి కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇదివరకు నీట్ పీజీ ఎస్ఎస్ పరీక్షలు 2021 మార్పులపై చివరి నిమిషంలో చేసిన మార్పులను ఇదివరకే సుప్రీంకోర్టు తప్పు పట్టింది.
నీట్ పీజీ కౌన్సెలింగ్పై
ఇప్పుడు తాజాగా- నీట్ పీజీ పరీక్షలకు సంబంధించిన కౌన్సెలింగ్ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ హోల్డ్లో ఉంచాలని సూచించింది. దీనికి కారణం- అఖిల భారత కోటా. ఈ కోటా కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికంగా బలహీన సెక్షన్లకు చెందిన వారు (ఈడబ్ల్యూఎస్)-ఇతర వెనుక బడిన తరగతులు (ఓబీసీ) రిజర్వేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లను తాము వ్యాలిడిటీ చేయాల్సి ఉందని, అది పూర్తయేంత వరకూ నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్ను నిలిపివేయలని ఆదేశించింది.
వాదనలేంటీ?
అఖిల భారత కోటా కింద ఈడబ్ల్యూఎస్-ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యాలిడేషన్పై దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే విచారణకు స్వీకరించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం వాదోపవాదాలను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, పిటీషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అరవింద్ దతార్ తమ వాదనలను వినిపించారు. ఇవ్వాళ్టి నుంచే నీట్ పీజీ పరీక్షల కౌన్సెలింగ్ ఆరంభం కావాల్సి ఉందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిలిపివేసేలా ఆదేశాలను జారీ చేయాలంటూ పిటీషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.
క్లారిఫికేటరీ నోటిఫికేషన్..
దీనిపై అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ మాట్లాడుతూ- దతార్ లేవనెత్తిన అభ్యంతరాల్లో అర్థం లేదని, సీట్ల వెరిఫికేషన్స్కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కళశాలలకు పంపించిన సమాచారాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని వాదిస్తున్నారని అన్నారు. ఇవ్వాళే కేంద్ర ప్రభుత్వం మరో క్లారిఫికేటరీ నోటిఫికేషన్ను జారీ చేసిందని చెప్పారు. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున.. కౌన్సెలింగ్ను నిర్వహించడం కష్టతరమౌతుందని, సానుకూలంగా స్పందించాలని అదనపు సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేశారు.
ఏకీభవించని బెంచ్..
భవిష్యత్తులో నీట్ పీజీ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అరవింద్ దతార్ తనను సంప్రదించవచ్చని అన్నారు. ఆయన వాదనలతో బెంచ్ ఏకీభవించలేదు. అఖిల భారత కోటాలో ఈడబ్ల్యూఎస్-ఓబీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే విషయంలో అభ్యర్థులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని, అది తేలేంత వరకూ, కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన విధానాన్ని తీసుకునేంత వరకూ నీట్ పీజీ పరీక్షల కౌన్సెలింగ్ను ఆన్ హోల్డ్లో ఉంచాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.
Recommended Video
రిజర్వేషన్ ఇలా..
నీట్ పీజీ పరీక్షలకు సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం అఖిల భారత కోటాలో కొన్ని మార్పులు చేసింది. ఇతర వెనుక బడిన తరగతులు (ఓబీసీ) అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్ను కల్పించింది. అదే విధంగా ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ విచారించిన తరువాత.. జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.