క్రిమినల్ రికార్డులున్నవారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా?: ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: క్రిమినల్ రికార్డులు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు.. హేతుబద్ధమైన ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
శబరిమల కోసం కొత్త చట్టం చేయండి: కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు, జనవరి 3లోగానే..
క్రిమినల్ రికార్డులున్నవారు..
క్రిమినల్ రికార్డులు ఉన్న వ్యక్తులను రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలబెట్టకుండా సరికొత్త విధానం తీసుకొచ్చేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని తిరస్కరించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.
ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
‘అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ను పరిగణలోకి తీసుకుని మూడు నెలల్లోగా హేతుబద్ధమైన ఉత్తర్వులు ఇవ్వాలని ఈసీని ఆదేశించాం' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయాల్లో నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల సంఖ్య పెరిగిపోతోందని అశ్విని ఉపాధ్యాయ్ విచారం వ్యక్తం చేశారు.
24శాతం క్రిమినల్ కేసుల్లో..
ఏడీఆర్(అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్) డేటా ప్రకారం పార్లమెంటు సభ్యుల్లో 24శాతం మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు పిటిషన్లో తెలిపారు. అందుకే క్రిమినల్ రికార్డులు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మూడు నెలల గడువు
అయితే, ఈ పిటిషన్పై ఈ ఏడాది జనవరి 22న విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని ఆదేశించింది. అయితే, తన అభ్యర్థనపై ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు అశ్విని ఉపాధ్యాయ్ తెలిపారు. దీంతో మూడు నెలల్లోగా ఉత్తర్వులు ఇవ్వాలని ఈసీని కోర్టు ఆదేశించింది.