సుప్రీం కోర్టులో చివాట్లు తిన్న టీటీవీ దినకరన్: మరో సారి వస్తే రూ. 10 లక్షలు ఫైన్ !
అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురై తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్న టీటీవీ దినకరన్ సుప్రీం కోర్టులో సోమవారం చివాట్లు తిన్నాడు.
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురై తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్న టీటీవీ దినకరన్ సుప్రీం కోర్టులో సోమవారం చివాట్లు తిన్నాడు. కోర్టు అంటే నీకు తమాషాగా ఉందా అంటూ టీటీవీ దినకరన్ కు సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది.
ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఇలాగే మరోసారి సుప్రీం కోర్టుకు వస్తే రూ. 10 లక్షలు అపరాద రుసుం విధిస్తామని సోమవారం సుప్రీం కోర్టు టీటీవీ దినకరన్ ను హెచ్చరించింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కేసుల విచారణ పూర్తి కావడానికి సహకరించాలని దినకరన్ కు సూచించింది.
నియమాలు ఉల్లంఘించి విదేశాల నుంచి అక్రమంగా నగదు లావాదేవీలు నిర్వహించారని టీటీవీ దినకరన్ తదితరుల మీద 20 ఏళ్ల క్రితం నమోదు అయిన కేసు (ఫెరా కేసు)ను మూడు నెలల్లో విచారణ పూర్తి చెయ్యాలని మద్రాసు హైకోర్టు ఎగ్మూరు ప్రత్యేక కోర్టుకు సూచించింది.
మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తు టీటీవీ దినకరన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 20 ఏళ్ల నుంచి విచారణ జరుగుతున్న ఫెరా కేసు విచారణకు ఇంకా సమయం కావాలని టీటీవీ దినకరన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు కేసుల విచారణకు వీలైనం త్వరగా సహకరించాలని, 20 ఏళ్లనాటి కేసు విచారణకు ఇంకా సమయం కావలని కోరడం నీకే మంచిది కాదని టీటీవీ దినకరన్ ను సుప్రీం కోర్టు హెచ్చరించడంతో ఆయన సమర్పించిన అర్జీని అతని న్యాయవాది సోమవారం వెనక్కి తీసుకున్నారు.