12మంది దోషులే.. గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు..
ఢిల్లీ : గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నిర్థారించిన 12మందిని దోషులుగా ప్రకటించింది. వారికి విధించిన జీవిత ఖైదును సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. హరేన్ పాండ్య మర్డర్ కేసును పునర్విచారించాలంటూ ఓ ఎన్జీఓ దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు కొట్టి వేసింది.
2003లో మోడీ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన హరేన్ పాండ్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా హత్య జరిగిందని ఆరోపణలు వచ్చాయి. సీబీఐ సైతం ఇదే ఆరోపణల ఆధారంగా చార్జ్ షీట్ ఫైల్ చేసింది. కేసును విచారించిన ట్రయల్ కోర్టు 12 మందిని దోషులుగా నిర్థారించింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.
శిక్ష పడిన 12మంది ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. దర్యాప్తు ఏకపక్షంగా సాగిందని వాదించింది. ఆ వాదనతో ఏకీభవించిన గుజరాత్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును కొట్టి వేసింది. 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన గుజరాత్ ప్రభుత్వంతో పాటు సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వారి పిటీషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం 12మందిని దోషులుగా నిర్థారించి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.