సుప్రీంకోర్టు సంక్షోభం: చీప్ జస్టిస్ విందుకు జస్టిస్ చలమేశ్వర్ గైరాజర్
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా బుధవారం విందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జస్టిస్ చలమేశ్వర్ పాల్గొనలేదు. ఆయన సెలవుపై వెళ్ళారు. మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
సీజేఐ మంగళవారం చాంబర్స్లో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసఫ్లతో సంభాషించారు. బుధవారం మధ్యాహ్నం విందు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే బుధవారం ప్రారంభమైన విందు సమావేశంలో జస్టిస్ చలమేశ్వర్ పాల్గొనలేదు. తనకు అనారోగ్యంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీజేఐ స్వయంగా చొరవ తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం జరిగిన సమావేశం 15 నిమిషాలసేపు సాగింది.
సుప్రీంకోర్టు పరిపాలనా వ్యవస్థ సక్రమంగా లేదని, కీలకమైన కేసుల విచారణకు బెంచీలను ఏర్పాటు చేయడంలో సీనియర్ జడ్జీలను కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్ జడ్జీలు ప్రకటించారు. బుధవారం ఎనిమిది కీలక కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆధ్వర్యాన ఐదుగురు సభ్యుల బెంచీని మంగళవారం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.అయితే ఈ బెంచీల్లో ఆరోపణలు చేసిన నలుగురు న్యాయమూర్తులు లేకపోవడం గమనార్హం