అయోధ్య కేసులో సుప్రీం కీలక తీర్పు: కేసు బదలీకి నో, 1994 తీర్పుకు సమర్థన
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించేందుకు నిరాకరించింది. అలాగే కేసు విచారణను అక్టోబర్ 29వ తేదీన జరుపుతామని తెలిపింది.
ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. అయోధ్య భూమి వివాదాన్ని త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది. ఇస్లాంలో మసీదు తప్పనిసరి అంతర్భంగా కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రార్థనలు చేసుకునేందుకు ఎలాంటి మసీదు అవసరం లేదని 1994లో చెప్పిన తీర్పును సమర్థించింది..
ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధం...భార్య భర్త సొత్తు కాదు: సుప్రీంకోర్టు
అన్ని ప్రార్థనా మందిరాలకు వాటి వాటి మతాల్లో ప్రత్యేక స్థానం ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అన్ని మతాలు కూడా సమానమేనని పేర్కొంది. 2-1తో తాజా తీర్పు ఇచ్చింది. కాగా, అయోధ్య కేసును త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది.
మసీదులు ఇస్లాంలో అంతర్భాగమా కాదా అనే అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదలాయించేందుకు నిరాకరించింది. మసీదులు ఇస్లాంలో భాగం కాదని సుప్రీం కోర్టు 1994లో తీర్పు వెలువరించింది. దీనిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపక్ మిస్రా, జస్టిస్ అశోక్ భూషణ్లు ఇప్పుడు తేల్చి చెప్పారు. ఇరువురి తరఫున తీర్పును జస్టిస్ అశోక్ భూషణ్ చదివారు. 1994 నాటి తీర్పుపై విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదలాయించాలని జస్టిస్ నజీర్ అన్నారు..