24 నెలల జైలు శిక్ష ఓ లెక్క కాదు: లాలూకు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దాణా స్కామ్లో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన ఆరోగ్యం బాగోలేదని తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ లాలూ ప్రసాద్ యాదవ్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్పై లాలూను విడుదల చేయలేమంటూ బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.
ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష అనుభవిస్తున్నారు.జనవరి 10న జార్ఖండ్ హైకోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ను బెయిల్ పై విడుదల చేస్తే ఎన్నికల కార్యకలాపాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉందని సీబీఐ తన వాదనలు న్యాయస్థానం ముందు వినిపించింది. కేవలం బయటకు వచ్చేందుకు మాత్రమే సాకుగా అనారోగ్యం అంశాన్ని లేవనెత్తుతున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది.వాదనలు విన్న న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
తాను గత 24 నెలలుగా జైలులో ఉన్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే తనకు విధించిన శిక్షలో 24 నెలలు ఒక లెక్కే కాదని కోర్టు అభిప్రాయపడింది. నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న లాలూకు పడిన శిక్ష రఫ్గా 25 ఏళ్లు అని కోర్టు గుర్తు చేసింది. లాలూను ఎందుకు విడుదల చేయకూడదు... బయటకు వస్తే అతని వల్ల కలిగే హానీ ఏంటని లాలూ తరపున వాదించిన న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును ప్రశ్నించారు.
అంతకుముందు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ 8నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయించు కుంటుండగా పలు రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొన్నారని సీబీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. దాణ కుంభకోణంకు సంబంధించి తనపై అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష అనుభవిస్తున్నారు.