సివిల్స్ పరీక్షలు యథాతథం- వాయిదా పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. అన్లాక్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ విద్యాసంస్దలు తెరిచే పరిస్ధితి లేదు. అలాగని పోటీ పరీక్షలు వాయిదా వేసే పరిస్ధితి కూడా లేదు. దీంతో ఇప్పటికే నీట్, జేఈఈ పరీక్షల విషయంలో కఠినంగానే వ్యవహరించిన సుప్రీంకోర్టు ఇవాళ సివిల్స్ పరీక్షల విషయంలోనూ తన వైఖరి అదేనని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఈ నెల 4న జరగాల్సిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ దాఖలైన పిటిషన్పై ఇవాళ తుది విచారణ జరిగింది. కోచింగ్ సెంటర్లు, విద్యాసంస్ధలు నడవని ప్రస్తుత పరిస్ధితుల్లో సివిల్స్ పరీక్షలు వాయిదా వేయడమే మంచిదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కానీ కేంద్రం, యూపీఎస్సీ మాత్రం పరీక్షలు వాయిదా వేస్తే దాని ప్రభావం ఇతర పరీక్షలపై ఉంటుందని, ప్రస్తుతం కోవిడ్ రోగులను కూడా పరీక్షలకు అనుమతిస్తున్నామని, ప్రయాణాలకూ అవకాశం ఉందని కోర్టుకు తెలిపాయి.
Recommended Video
దీంతో సుపీంకోర్టు ఈ నెల 4న జరగాల్సిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించింది. అయితే ఈసారి చివరి అవకాశం అయి ఉండి పరీక్ష రాయలేని వారికి మినహాయింపులపై ఆలోచిస్తామని మాత్రం కేంద్రం తెలిపింది. పిటిషనర్ వాదనలు విన్న కోర్టు... సివిల్స్ అభ్యర్ధులకు అడ్మిట్ కార్డులు చూపిస్తే స్ధానికంగా హోటళ్లలో వసతికి అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. సివిల్స్ పరీక్షళ కోసం ఇప్పటికే రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది.