ఎన్ఆర్సీ తుది గడువు పెంచిన సుప్రీంకోర్టు : ఆగస్టు 31వరకు పూర్తిచేయాలని ఆదేశం
న్యూఢిల్లీ : జాతీయ పౌరసత్వ రిజిష్టరులో అసోంకి చెందిన వారి పేర్లు చేర్చడం/ తొలగించే ప్రక్రియకు గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. వాస్తవానికి ఎన్ఆర్సీ జాబితాను కో ఆర్డినేటర్ రూపొందించి ఈ నెల 31వ తేదీ నాటికి సమర్పించాలని తొలుత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే జాబితాలో పేర్ల చేరికపై అన్నివర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. దీంతో అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో జాబితా రూపొందించేందుకు సుప్రీంకోర్టు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
జాతీయ పౌరసత్వ రిజిష్టరులో పేర్ల చేరిక/తొలగింపుపై వచ్చేనెల 7న ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టస్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా పిటిషినర్లు, ఆయా సంస్థలు వేసిన పిటిషన్లను 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని తెలిపింది. అయితే అసోంలో ఇప్పటికే వెరిఫై చేసిన 20 శాతం జాబితాకు సంబంధించిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ జాబితాలో ఆయా వ్యక్తుల చేరిక/ తొలగింపుపై స్పష్టత లేదని పేర్కొంది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించేందుకు .. ఎన్ఆర్సీ కో ఆర్డినేటర్ చేసిన వాదనలే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే 72 లక్షల మంది ప్రజల వెరిఫికేషన్ చేశామని, రీ వెరిఫై కూడా చేశామని పేర్కొన్నారు. దీంతో కో ఆర్డినేటర్ వాదనలను పరిగణలోకి తీసుకుని .. ఈ మేరకు తీర్పునిచ్చింది.
అసోంలో జాతీయ పౌరసత్వ రిజిష్టరులో పేరు నమోదుకు సంబంధించి క్లాస్ 1 అధికారి నేతృత్వంలో సర్వే చేపట్టాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో క్షేత్రస్థాయిలో పక్కా సమాచారంతో పేర్ల నమోదు జరుగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు ఆయా జిల్లాలపై వారికి పూర్తిగా పట్టు ఉంటుందని తెలిపింది. అంతేకాదు ఇదివరకు పనిచేసిన అనుభవంతో ఎన్ఆర్సీ ప్రక్రియ సులువుగా, కచ్చితత్వంగా ముగుస్తోందని అంచనా వేసింది.