అయోధ్యపై ముగిసిన తుది విచారణ: తీర్పు రిజర్వ్ లో: నెలరోజుల లోపలే వెలువడే ఛాన్స్?
న్యూఢిల్లీ: దశాబ్దాల కాలంగా పలు న్యాయస్థానాల్లో నానుతూ వస్తోన్న అయోధ్య భూ వివాదంపై విచారణ ముగిసింది. ఈ కేసుపై దాఖలైన పిటీషన్లపై విచారణలను చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. బుధవారం తుది విచారణ నిర్వహించింది. సాయంత్రం 4 గంటలకు విచారణ ముగిసినట్లు ప్రకటించింది. ఇక ఈ కేసులో తీర్పు వెలువడటమే మిగిలి ఉంది. చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై నెలరోజుల లోపే తీర్పు వెలువడొచ్చని తెలుస్తోంది. చివరి రోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో అనేక హైడ్రామాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటి మధ్య విచారణ సాయంత్రం వరకూ కొనసాగింది.
ఇంట్రెస్టింగ్: అయోధ్య కేసుతో ఢిల్లీలోని ఓవైసీ బంగ్లాకు సంబంధం ఏమిటి..?
నవంబర్ 17 లోపలే తీర్పు వెలువడుతుందా?
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం ఎవరికి చెందాలనే అంశంపై వచ్చేనెల 17వ తేదీ లోపలే తీర్పు వెలువడే అవకాశాలు లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయబోతుండటమే. నవంబర్ 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయబోతున్నారు. ఈలోగా ఆయన అయోధ్య స్థల వివాదంపై తీర్పును వెలువరిస్తారని న్యాయ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రంజన్ గొగొయ్ నేతృత్వంలో అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ప్రతిష్ఠాత్మక అయోధ్య వివాదంపై విచారణ నిర్వహించింది.
లిఖిత పూరక అభిప్రాయాలకు మూడరోజులు..
అయోధ్య భూ వివాదంపై తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకునే వారికి సుప్రీంకోర్టు మరో అవకాశాన్ని కల్పించింది. ఈ కేసు విచారణలో ఇదే చిట్ట చివరిదిగా భావించవచ్చు. లిఖిత పూరకంగా తమ పిటీషన్లను దాఖలు చేయవచ్చని రంజన్ గొగొయ్ వెల్లడించారు. ఇప్పటిదాకా ఆలకించిన వాదోపవాదాలతో పాటు ఈ మూడు రోజుల్లో దాఖలయ్యే లిఖిత పూరక పిటీషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. వాటన్నింటినీ క్రోడీకరించి తీర్పును వెల్లడిస్తామని గొగొయ్ స్పష్టం చేశారు. తీర్పు వెలువడించే తేదీ ఆయన వెల్లడించలేదు.
40వ విచారణతో ముగింపు..
రంజన్ గొగొయ్ సహా ఎస్ ఏ బొబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ ఏ నజీర్ లతో కూడిన ధర్మాసనం మొత్తంగా 40 సార్లు విచారణలను చేపట్టింది. అఖిల భారత హిందూ మహాసభ, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డు సహా పలువురు కక్షిదారులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ కొనసాగింది. ఆయా సంఘాల ప్రతినిధుల తరఫున ప్రముఖ న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. హిందూ మహాసభ తరఫున వికాస్ సింగ్, నిర్మోహి అఖాడా తరఫున సుశీల్ కుమార్ జైన్, సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున రాజీవ్ ధవన్ వాదోపవాదాలను ధర్మాసనం ముందుంచారు.
6000 పేజీల అలహాబాద్ హైకోర్టు తీర్పు..
2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు హిందూ ధార్మిక సంఘాలు, ముస్లిం సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. 2.77 ఎకరాల స్థలాన్ని రామ్లల్లా విరాజమాన్, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్బోర్డులకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ 2011లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ మిళితం చేసి విచారణను కొనసాగిస్తోంది సుప్రీంకోర్టు. ఇక అప్పటి నుంచి కోర్టులోనే కేసు మగ్గుతూ వస్తోంది.
శ్రీరాముడి జన్మస్థలంలోనే రామమందిరం..
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో చారిత్రాత్మక బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలంలోనే శ్రీరామచంద్రుడి ఆలయాన్ని నిర్మించాలంటూ హైందవ సంఘాలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్థలం తమకు దక్కుతుందటే.. తమకు దక్కుతుందంటూ రామ జన్మభూమి న్యాస్, బాబ్రీ మసీదు కమిటీ సుప్రీంకోర్టులో కేసు వేశాయి. సంవత్సరాల నుంచీ ఈ కేసు న్యాయస్థానాలో నానుతూ వస్తోంది. ఇదివరకు అలహాబాద్ హైకోర్టు బెంచ్, ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు రెండు కమిటీల ప్రతినిధులు.