తెరపై వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం.. నలుగురు నిందితుల ఎన్కౌంటర్: సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. నలుగురు నిందితుల ఎన్కౌంటర్ వంటి విషయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వార్తల్లో నిలిచాయి. ఈ హత్యోదంతం కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై సమగ్ర దర్యాప్తు చేపట్టడానికి, దానికి సంబంధించిన నివేదికను అందజేయడానికీ ఏర్పాటైన విచారణ కమిషన్ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేసింది.
దేశాన్ని నివ్వెరపోయేలా చేసిన ఘటన..
షాద్నగర్కు చెందిన వెటర్నరీ డాక్టర్ దిశ గత ఏడాది డిసెంబర్లో నలుగురు యువకుల చేతుల్లో దారణంగా అత్యాచారానికి, హత్యకు గురైన విషయం తెలిసిందే. మహ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు శంషాబాద్ టోల్గేట్ సమీపంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. హత్య చేశారు. షాద్ నగర్ సమీపంలోని ఓ ఫ్లైఓవర్ కింద డాక్టర్ దిశ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సగం కాలిన స్థితిలో ఆమె మృతదేహం పోలీసులకు లభించింది. ఈ ఘటన అప్పట్లో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కేసులో పోలీసులు శరవేగంగా స్పందించారు.
ఎన్కౌంటర్పై వివాదాలు..
సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర సాక్ష్యాల ఆధారంగా నలుగురు నిందితులను గుర్తించారు. అరెస్టు చేశారు. అనంతరం సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వారిని ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో నలుగురూ తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించడంతో ఎన్కౌంటర్ చేశారు. సైబరాబాద్ పోలీసులు ఈ ఎన్కౌంటర్ను నిర్వహించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సారథ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారం సైతం విమర్శలకు దారి తీసింది.
పోలీసులపై కేసు నమోదు..
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయి. వారిపై చర్యలు చేపట్టాలంటూ మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అటు తెలంగాణ హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టుల్లో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. దీనితో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఎన్కౌంటర్పై విచారణ చేపట్టడానికి ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్, బోంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్పీ సొందుర్ బల్దోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ కార్తికేయన్లను కమిషన్ సభ్యులుగా నియమించింది. ఆరు నెలల్లోగా దర్యాప్తు నివేదికను అందజేయాలని ఆదేశించింది.
Recommended Video
కరోనా ఎఫెక్ట్
తాజాగా ఈ కమిషన్ గడువును మరో ఆరునెలల పాటు పొడిగించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డెతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కమిషన్ ఆశించిన స్థాయిలో హైదరాబాద్ ఎన్కౌంటర్పై విచారణను కొనసాగించట్లేదని అభిప్రాయపడింది. కమిషన్ గడువును మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు ఆదేశాలను ఇచ్చింది. ఇప్పటిదాకా చోటు చేసుకున్న విచారణ వివరాలపై ఆరా తీసింది.