అర్నబ్ గోస్వామికి భారీ ఊరట: మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు, కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ/ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామితోపాటు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్నవారికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర హైకోర్టు.. అర్నబ్ గోస్వామికి బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రియంచిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతేగాక, మహారాష్ట్ర సర్కారు, హైకోర్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దని స్పష్టం చేసింది.
కాగా, తనను అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు అర్నబ్. ఆయన తరపున న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ.. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా జరుగుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ.. 'టీవీ ఛానల్స్ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్ ఆధారపడి ఉందా? మే ఆ టీవీ చూడం, కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది సరైనదిగా అనిపించడం లేదు వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే తామున్నామని గుర్తుంచుకోండి' అని స్పష్టం చేశారు.
తమ కేసు ఎఫ్ఐఆర్ దశ దాటిపోయిందని, దర్యాప్తు జరిగిన తర్వాతే 2018, మేలో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు న్యాయవాది సాల్వే తెలిపారు. అంతేగాక, ఈ కేసు పునర్ దర్యాప్తు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిచారు.
Recommended Video
ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గత కొద్ది రోజులుగా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసులో గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్కు నవంబర్ 18 వరకు రాయిగఢ్ జిల్లా కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో అర్నబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఊరట లభించింది.