ఎరిక్సన్కు డబ్బులు చెల్లించండి లేదా జైల్లో కూర్చోండి: అనిల్ అంబానీపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఇప్పటికే రాఫెల్ రచ్చతో తల బొప్పి కట్టుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు నుంచి మరో షాక్ వచ్చింది. ఎరిక్సన్కు బాకీ పడ్డ బకాయిలన్నిటినీ నాలుగువారాల్లోగా చెల్లించకుంటే జైలులో ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. వడ్డీతో సహా అన్ని రుణాలను తీర్చితేనే అంబానీతో సహా రిలయన్స్ కమ్యూనికేషన్స్లో డైరెక్టర్లుగా ఉన్న అందరూ జైలు శిక్ష నుంచి తప్పించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఎరిక్సన్ సంస్థకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ రూ.453 కోట్లు అప్పుగా తీసుకుని చెల్లించలేదు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎరిక్సన్ సంస్థ. పిటిషన్ను విచారణ చేసింది జస్టిస్ రోహిన్టన్ ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం. ఎరిక్సన్ నుంచి తీసుకున్న రూ.453 కోట్లు అదనంగా వడ్డీతో సహా నాలుగువారాల్లో చెల్లించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థను ఆదేశించింది. అనిల్ అంబానీ, ఇతర డైరెక్టర్లు కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని జస్టిస్ నారిమన్ తన తీర్పును చదివారు. ఈ కేసులో వారు ముద్దాయిలని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. నియమనిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని జడ్జీ పేర్కొన్నారు. అంతేకాదు అనిల్ అంబానీ ఉద్దేశ పూర్వకంగానే నియమ నిబంధనలను ఉల్లంఘించారని జడ్జి వెల్లడించారు. అయితే తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లిస్తే నిందితులుగా పరిగణించమని కోర్టు స్పష్టత ఇచ్చింది.
ఇక తీర్పును జస్టిస్ నారిమన్ చదివి వినిపిస్తున్న సమయంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్కు సంబంధించిన డైరెక్టర్లు కోర్టు హాలులోనే ఉన్నారు. ఎరిక్సన్ నుంచి అప్పుగా తీసుకున్న డబ్బులను చెల్లించకపోవడంతో ఆ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు రిలయన్స్ సంస్థకు అనిల్ అంబానీలకు నోటీసులు పంపింది. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. మరోవైపు అనిల్ అంబానీకి అనుకూలంగా ఇద్దరు సుప్రీంకోర్టు అధికారులు వ్యవహరించడంతో వారిపై వేటు వేసింది అత్యున్నత ధర్మాసనం. అనిల్ అంబానీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు ఇవ్వగా దాన్ని అధికారులు కొట్టివేసి ట్యాంపరింగ్కు పాల్పడ్డారు.