కేరాఫ్ కాంట్రవర్శి: సుప్రీంకోర్టు మనదే...రామ మందిర నిర్మాణం జరుగుతుందన్న యూపీ మంత్రి
అధికారం చేతిలో ఉంది..ఎలాగ మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారో ఏమో తెలియదుకానీ.. బీజేపీ నేతలు మాత్రం తమ నోటికి హద్దు వేయకుండా ఉన్నారు. రోజుకొకరు రోజకో కొత్త వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసైనా సరే పెళ్లి జరిపిస్తామని ఒక బీజేపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరవకముందే... తాజాగా యూపీకి చెందిన మరో మంత్రి సుప్రీం కోర్టు మనదే... రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని చెప్పి కొత్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకి వెళితే...ఉత్తర్ప్రదేశ్లోని సహకార మంత్రిగా ఉన్న ముకుట్ బీహారీ వర్మ తాజాగా వివాదాస్ప వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఎప్పటి నుంచో వివాదాలకు మారుపేరుగా నిలిచిన అయోధ్య రామమందిర నిర్మాణం అంశంపైనే ఆయన వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణం అయోధ్యలో కచ్చితంగా నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు మనదే అనే వ్యాఖ్యలు చేశారు మంత్రి. రామమందిరం నిర్మాణం బీజేపీ ప్రభుత్వం చేపడుతుందని..అది ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు. బీజేపీ రామమందిర నిర్మాణం అంశంపైనే అధికారంలోకి వచ్చిందని చెప్పిన మంత్రి అభివృద్ధి కూడా చేస్తామని చెప్పడంతోనే ప్రభుత్వంలోకి వచ్చామని చెప్పారు. రామమందిర నిర్మాణం పూర్తి చేయడమే తమ లక్ష్యంగా ఉందని చెప్పిన మంత్రి రామమందిర నిర్మాణం తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పారు.
రామమందిర నిర్మాణ అంశం కోర్టు పరిధిలో ఉందికదా ఎలా నిర్మిస్తారని మంత్రి ముకుట్ బిహారీ వర్మను ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా... వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టే సుప్రీంకోర్టు కూడా మాదే, ఎగ్జిక్యూటివ్ మాదే, చట్టసభలు మావే, దేశం మాదే, రామమందిరం కూడా మాదే అని చెప్పారు.మరోవైపు ముకుట్ బిహారీ వర్మ పక్కనే కూర్చున్న కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. మంత్రి వ్యాఖ్యలు బయటకు వెళ్లడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. తన మాటలను వక్రీకరించారని చెప్పాడు. సుప్రీంకోర్టు భారత్లో ఉంది కాబట్టి అది మనదే అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్లు తెలిపారు.