మాజీ ఆర్మీ చీఫ్ వికె సింగ్కు కోర్టు ధిక్కరణ నోటీసులు
న్యూఢిల్లీ: మాజీ ఆర్మీ చీఫ్ వికె సింగ్కు సుప్రీం కోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వయసు వివాదం ఉత్తర్వులపై వికె సింగ్ చేసిన వ్యాఖ్యలకు గాను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వికె సింగ్ వ్యాఖ్యలు కోర్టును ధిక్కరించే విధంగా ఉన్నందునే నోటీసులు జారీ చేసినట్లు కోర్టు తెలిపింది.
ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వికె సింగ్ చేసిన వ్యాఖ్యలు కోర్టు అధికారాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విషయంలో సహాయం అందించాలని అటార్నీ జనరల్ను అడిగింది. మాజీ ఆర్మీ చీఫ్ వికె సింగ్ తన వయసు వివాదంలో చేసిన వ్యాఖ్యలను సోమవారం సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు మంగళవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో అక్టోబర్ 23లోగా వివరణ ఇవ్వాలని వికె సింగ్ను కోర్టు ఆదేశించింది.
వయసు వివాదం కేసులో వికె సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్కు సరైన ఆధారాలు ఇవ్వకపోవడంతో సుప్రీం కోర్టులో పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తన మెట్రిక్యూలేషన్ ధృవీకరణ పత్రాల ఆధారంగా తన వయస్సును నిర్ధారించాలని, అత్యాచారం కేసుల్లో కూడా బాధితురాలి వయస్సును తెలుసుకునేందుకు ఆ ధృవీకరణ పత్రాలనే ఆధారంగా తీసుకుంటున్నారని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వికె సింగ్ కోర్టుకు సూచించారు.
అంతేగాక అత్యాచారం కేసులో మెట్రిక్యూలేషన్ ధృవీకరణ పత్రాలను ఆధారం చేసుకుని బాధితురాలి వయస్సును నిర్ధారిస్తున్న కోర్టు, తన విషయంలో కూడా తన ధృవీకరణ పత్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు కదా అని కోర్టును ప్రశ్నించినట్లు నివేదికలో పేర్కొనడం జరిగింది. కాగా సర్వీసు రికార్డు ప్రకారం ఉన్న వికె సింగ్ పుట్టిన తేది మే10, 1950 విషయంలో తాము జోక్యం చేసుకోమని సుప్రీం తేల్చి చెప్పింది.