కశ్మీరీ విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోండి: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యను అభ్యసిస్తున్న కశ్మీరీ విద్యార్థులకు భద్రత కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి మరో 11 రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పుల్వామా ఉగ్రదాడుల తర్వాత కశ్మీరీ విద్యార్థులపై దాడులు, చిత్రహింసలు ఎక్కువయ్యాయని వారకి భద్రత కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా,మేఘాలయా, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీలకు నోటీసులు జారీ చేసింది.
కశ్మీరీ విద్యార్థుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంశాఖ సలహాలు సూచనలు ఇస్తుందని నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు కశ్మీరీ విద్యార్థులకు రక్షణ కల్పించే బాధ్యతను ఆయా రాష్ట్ర డీజీపీలు తీసుకోవాలని ఆదేశించింది. ఫిబ్రవరి 14న జైషే మొహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై తన కారుతో దూసుకెళ్లడంతో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడి జరిగిన తర్వాత పలు రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు దేశవ్యతిరేక కార్యకలాపాలకు కశ్మీరీలు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పలు కశ్మీరీ విద్యార్థులను విద్యాసంస్థల యాజమాన్యాలు సస్పెండ్ చేశాయి. అంతేకాదు ఇళ్లు అద్దెకు తీసుకుని ఉన్న విద్యార్థులను వెంటనే ఇళ్లను కొందరు యజమానులు ఖాళీ చేయించారు.
దేశవ్యాప్తంగా కశ్మీరీ విద్యార్థులపై దాడులు చేస్తున్నారని వారికి రక్షణ కల్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది అయిన తారిక్ అదీబ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుల్వామా ఉగ్ర దాడుల తర్వాతే కశ్మీరీ విద్యార్థులపై దాడులు ఎక్కువైయ్యాయని తారిఖ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కశ్మీరి విద్యార్థులకు ఆయా విద్యాసంస్థలు భద్రత కల్పించాలని కోరారు. వారికి ప్రాణహాని ఉందని భద్రతతో పాటు మైనార్టీల హక్కులకు భంగం వాటిల్లకుండా అధికారులు భరోసా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్లో తారిఖ్ కోరారు. కశ్మీరీ విద్యార్థులపై దాడులు, అవమానాలు, చిత్రహింసలు, ఇతరత్రా దాడులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ మరో అడ్వకేట్ సత్యమిత్ర ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణ చేసిన ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దేశవ్యాప్తంగా ఉన్న కశ్మీరీ విద్యార్థులకు రక్షణ కల్పించాలని తీర్పులో పేర్కొంది.