కథువా రేప్ కేసు: మృతురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలి: సుప్రీం
న్యూఢిల్లీ: కథువా అత్యాచార ఘటనలో మృతురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది దీపిక ఎస్. రాజావత్కు కూడ రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
కథువాలో ఎనిమిదేళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో తనకు రక్షణ కల్పించాలని మృతురాలి తండ్రి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సోమవారం నాడు నోటీసులు ఇచ్చింది.
మృతురాలి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును వాదిస్తున్న దీపిక అనే న్యాయవాదికి కూడ బెదిరింపులు వస్తున్నట్టు ఆమె మీడియాకు వివరించింది.
ఈ తరుణంలో దీపీకకు కూడ రక్షణ కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కథువా అత్యాచార ఘటనపై జమ్మూలో ఇవాళ విచారణ ప్రారంభమైంది.
ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 28వ తేదికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఎనిమిది మంది నిందితుల్లో ఒక నిందితుడు మైనర్. అయితే మైనర్ను ఈ కేసులో విడిగా విచారించనున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులు నార్కో ఎనాలసిస్ టెస్ట్కు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.