కేంద్ర మంత్రివర్గ ఆమోదం.. 33కు చేరిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. ఇదివరకున్న 30 మంది న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు 33కు చేరింది. ఆ మేరకు బుధవారం నాడు సెంట్రల్ కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరాలు వెల్లడించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice Of India - CJI) తో పాటు 33 మంది న్యాయమూర్తులు ఉంటారని తెలిపారు జవదేకర్. పార్లమెంటులో సదరు బిల్లుకు ఆమోదం లభిస్తే సీజేఐతో పాటు ఆ సంఖ్య 34కు చేరనుంది. అదలావుంటే న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందంటూ గతంలో సుప్రీం కోర్టు పలుమార్లు కేంద్రానికి గుర్తు చేసిన సందర్భాలున్నాయి.
వాస్తవానికి 1956లో తీసుకొచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టానికి 2009లో సవరణలు తీసుకువచ్చారు. అప్పుడు సీజేఐతో కాకుండా న్యాయమూర్తుల సంఖ్యను 25 నుంచి 30కి పెంచారు. అదలావుంటే న్యాయమూర్తులను సంఖ్య పెంపునకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన కొద్ది రోజుల్లోనే కేబినెట్ నుంచి ఈ నిర్ణయం వెలువడింది.