న్యాయవ్యవస్థ విలువలకు భంగం వాటిల్లుతోంది: రాఫైల్ తీర్పుపై అరుణ్ శౌరి
Recommended Video
రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ విలువలకు భంగం కలిగించేలా ఉందని ఆయన అన్నారు. రాఫెల్ పై పిటిషన్ వేసిన వారిలో అరుణ్ శౌరి కూడా ఉన్నారు. రాఫెల్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మీరు సంతృప్తి చెందారా అన్న విలేఖరి ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.
సుప్రీం తీర్పుతో తాను బాధపడలేదని అయితే సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పు ఇవ్వడం వల్ల న్యాయవ్యవస్థ విలువలు ప్రశ్నార్థకంగా మారుతుందని శౌరీ వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటునే సుప్రీం కోర్టు చదివినట్లుగా తనకు అనిపించిందని శౌరి వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాము ముందు నుంచి వాదిస్తున్నట్లుగా రాఫెల్లో ఏదో అవకతవకలు జరిగినట్లు రుజువయ్యాయని పేర్కొన్నారు. అయితే దీనిపై త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు శౌరి.
జర్నలిస్టుల అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న శౌరి ఈ దేశంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఛానెళ్లు, న్యూస్పేపర్లు జర్నలిస్టులు ఇంకా మిగిలే ఉన్నారని చెప్పారు. రెండు వర్గాల వారినుంచి అభిప్రాయం తీసుకునే జర్నలిజం విలువలు ఎప్పుడో మాయమయ్యాయని తెలిపారు. అంతేకాదు చాలా మటుకు ప్రభుత్వానికి బాకా ఊదేందుకే ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంటర్నెట్కు వెళ్లి సేకరించాలని చెప్పారు. అప్పుడే అసలు వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. జర్నలిస్టులు నిజాలు మాట్లాడాలని అదే సమయంలోప్రజలకు వాస్తవాలు చేరవేయాలని చెప్పారు. నోట్లో ఎముక పెట్టుకున్న కుక్క ఎప్పటికీ మొరగలేదని చెప్పారు. ఇక్కడ మోడీ ఏం చేస్తారనేది ప్రశ్న కాదు మీరు ఏంచేస్తున్నారనేదే ప్రశ్న అని వ్యాఖ్యానించారు.