గ్యాంగ్రేప్ కేసు తీర్పు కాపీ రాస్తూ..కుర్చీలోనే స్పృహ తప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి..!
న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి సంబంధించిన పిటీషన్పై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ పిటీషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి స్పృహ తప్పారు. వెంటనే ఆమెను కోర్టు హాల్ నుంచి ఛాంబర్కు తరలించారు. సపర్యలు చేశారు. కొద్ది సేపటి తరువాత ఆమె కోలుకున్నారు. ఫలితంగా- ఈ కేసు తదుపరి విచారణ వాయిదా పడింది.
శుక్రవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటీషన్ అది. తాను దాఖలు చేసిన క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అతను సుప్రీంకోర్టులో పిటీషన్ను ఇదివరకే దాఖలు చేశాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది.
ఈ నోటీసులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేసింది. దీనిపై ఈ ఉదయం సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఎస్ఏ బొపన్న, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం విచారణ ముగించింది కూడా. వినయ్ శర్మ దాఖలు చేసిన పిటీషన్ను తోసి పుచ్చింది. అనంతరం దీనికి సంబంధించిన తీర్పు కాపీని రాస్తున్న సమయంలో.. జస్టిస్ ఆర్ భానుమతి స్పృహ కోల్పోయారు. కుర్చీలోనే పక్కకు వాలిపోయారు.
దీన్ని చూసిన వెంటనే సిబ్బంది.. ఆమెను వీల్ చైర్పై ఛాంబర్కు తరలించారు. డాక్టర్లను పిలుచుకుని వచ్చారు. భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. విచారణ సందర్భంగా కూడా ఆమె జ్వరంతోనే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం జస్టిస్ భానుమతికి డాక్టర్లు చికిత్స చేస్తున్నారని చెప్పారు. తాత్కాలిక వైద్యం, మందులను తీసుకుని విచారణకు హాజరయ్యారని, జ్వరం విషమించడంతో స్పృహ కోల్పోయారని తుషార్ మెహతా వివరించారు.
అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో.. సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఆర్డర్ కాపీని పూర్తి చేయలేకపోయింది. దీనితో ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. భానుమతి పూర్తిగా కోలుకున్న తరువాతే తీర్పు కాపీని వెలువడిస్తామని స్పష్టం చేసింది. కాగా- వినయ్ శర్మ దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో.. ఉరిశిక్షను అమలు చేయడానికి మార్గం సులభతరమైందని న్యాయవాదులు చెబుతున్నారు.