అయిదు రోజులు..అయిదు కేసులు: చీఫ్ జస్టిస్ స్వీయ పర్యవేక్షణలో : 17న గొగోయ్ పదవీ విరమణ..!
సుదీర్ఘ వివాదాలు. సున్నిత అంశాలు. న్యాయ పరంగా...రాజకీయంగా..విశ్వాసాల ఆధారంగా ముడి పడి ఉన్న వ్యవహారాలు. ఇటువంటి వివాదాస్పద కేసులకు భారత ప్రధాన న్యాయమూర్తి తన పదవీ విరమణకు ముందే పరిష్కారం చూపాలని భావించారు. ఆ దిశగా అయిదు రోజుల్లోనే అయిదు కీలక కేసులను సంబంధించిన తీర్పులు వెల్లడించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో..ఆయన తన బాధ్యతల నుండి రిలీవ్ అవ్వటానికి ముందుగానే పరిష్కారానికి సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నఅంశాల మీద ఫోకస్ చేసారు. అయోధ్య లాంటి సున్నితమైన అంశంలో వ్యక్తిగతంగా శాంతి భద్రతల విషయం పైనా ఆరా తీసారు. సెలవు రోజు ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చారు. మిగిలిన నాలుగు కేసుల్లోనూ అదే రకంగా వ్యవహరించారు. ఇక, ఈ ఒక్క రోజే మూడు కేసుల్లో తీర్పు చెప్పారు.
రిటైర్ అయ్యేలోగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పనున్న తీర్పులు ఇవే..!
అయోధ్య అంశంలో స్వయంగా రంగంలోకి..
అయోధ్య వివాదం. దేశ రాజకీయాల్లో అతి సున్నితంగా మారిన వ్యవహారం. దీని పైన దాదాపు 134 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పరమైన వివాదం. ఈ కేసు పరిష్కారం కోసం రాజ్యాంగ సున్నితమైన అంశంపై 40 రోజుల సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు అక్టోబర్ 16న తీర్పును రిజర్వ్ చేసింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలో జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ లు ఈ కేసుకు సంబంధించిన ధర్మాసనం సభ్యులుగా వ్యవహరించారు. ఈ ధర్మాసనం సున్నిత..సుదీర్ఘ కాలం సాగిన ఈ 148 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపించి చరిత్రలో నిలిచారు. ఇక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అందుకు అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి భారత ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక చొరవ చూపి మరీ ప్రయత్నాలు చేసారు. ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చారు.
మరో నాలుగు కేసుల్లోనూ అదే స్పూర్తితో..
తన పదవీ విరమణకు ముందే మిగిలిన నాలుగు కేసుల్లోనూ తీర్పు ఇవ్వాలని సీజే నిర్ణయించారు. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయమూ ఆర్టీఐ పరిధిలోకి వస్తందని సంచలన తీర్పు ఇచ్చారు. తద్వారా ఆ చర్చకు..వివాదానికి ముగింపు పలికారు. ఇక, మరో కీలకమైన అంశం శబరిమలలో మహిళల ప్రవేశం. దీని పైన చీఫ్ జస్టిస్ ధర్మాసం ఏడుగురు జడ్జిల ధర్మాసనం కు నివేదించాలని నిర్ణయించింది. గత తీర్పు పైన స్టే మాత్రం ఇవ్వలేదు. అదే విధంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న రఫెల్ అంశం మీద తుది తీర్పు ఇచ్చారు. గతంలో ఇచ్చిన తీర్పుపైన వచ్చిన రివ్యూ పిటీషన్లను పరిశీలించారు. సీబీఐకు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చారు. ఫలితంగా అందులో విచారణార్హత కలిగిన అంశం లేదంటూ రివ్యూ పిటీషన్ కొట్టేసారు. ఇక, రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైన దాఖలైన పిటీషన్ మీద తీర్పు ఇచ్చారు. రాహుల్ గాంధీకి మొట్టికాయలు వేస్తూ..సుతిమెత్తని హెచ్చిరకలు చేస్తూ కోర్టు మందలించింది. ఇలా.. అయిదు కీలక అంశాలకు సుప్రీం చీఫ్ జస్టిస్ సారధ్యంలో తీర్పులు వెలువడ్డాయి.
చారిత్రక తీర్పుల్లో సీజేఐ కీలక పాత్ర..
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ అయోధ్య కేసుకు సంబంధించి ధర్మాసనానికి సారధ్యం వహిస్తున్నారు.నవంబర్ 18, 1954 న జన్మించిన జస్టిస్ రంజన్ గొగోయ్ 1978 లో బార్ కౌన్సిల్లో చేరారు. గౌహతి హైకోర్టుతో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన 2001 లో గౌహతి హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2010 లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 లో పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 , ఏప్రిల్ 23 న జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి కేశబ్ చంద్ర గొగోయ్ అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయిదు రోజుల్లో అయిదు కీలక అంశాల పైన తీర్పు విషయంలో కీలకంగా వ్యవహరించిన ఆయన నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు.