ప్రధాని మోడీకి షాక్ ఇచ్చిన రామ్ జఠ్మలానీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర మాజీ మంత్రి, సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానీ పెద్ద షాక్ ఇచ్చారు. ఇక ముందు తాను నరేంద్ర మోడీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం లేదని, ఆయనతో తన బంధాన్ని తెంచుకుంటున్నానని ప్రకటించారు.
ఎంతో కీలకమైన విజిలెన్స్ శాఖలో అవినీతి చక్రవర్తి కూర్చున్నారని మండిపడ్డారు. విజిలెన్స్ చీఫ్ కమిషనర్ గా(సీవీసీ) కేవీ చౌదరిని నియమించడంతో నరేంద్ర మోడీ మీద ఉన్న గౌరవం పోయిందని అన్నారు. కేవీచౌదరి పెద్ద అవినీతిపరుడని మండిపడ్డారు.
కేవీ. చౌదరి మీద లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయని రామ్ జఠ్మలానీ అంటున్నారు. చౌదరి అవినీతిపై తాను సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తానని ఆయన సోమవారం సోషల్ మీడియాలో ప్రకటించారు. మోడీకి ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ఒక లేఖ వ్రాశారు.
బీజేపీ సీనియర్ నేతలు చాల మంది మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉండరాదని గతంలో వ్యతిరేకించిన సమయంలో రామ్ జఠ్మలానీ మోడీకి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఆయనే మోడీ మీద మండిపడటంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.
ఆప్ నుండి ప్రశాంత్ భూషణ్ ను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈయన సుప్రీం కోర్టు న్యాయవాది. కేవీ చౌదరిని విజిలెన్స్ చీఫ్ గా నియమింయడం అవమానకరం అని, తాను సుప్రీం కోర్టులో కేసు వేస్తానని ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు రామ్ జఠ్మలానీ తోడు కావడంతో కేవి చౌదరికి చిక్కులు మొదలైనాయి.