మోసం చేశారు! ఆస్తులు అమ్మాల్సిందే: యూనిటెక్కు షాకిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ యునిటెక్ లిమిటెడ్కు చిక్కులు తప్పేలా లేవు. తాజాగా ఆ సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గృహ కొనుగోలుదారులను యునిటెక్ మోసం చేసిందని.. వారి డబ్బులను రీఫండ్ చేయాలంటే సంస్థ ఆస్తులను వేలం వేయాలని తేల్చి చెప్పింది.
కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకుని, వారికి సరైన సమయంలో ఇళ్లను నిర్మించి ఇవ్వలేదన్న ఆరోపణలతో యునిటెక్ లిమిటెడ్పై పలు కేసులు నమోదయ్యాయి. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది.
కొనుగోలుదారుల డబ్బులు తిరిగి చెల్లించేందుకు గాను యునిటెక్ ఆస్తులను వేలం వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కంపెనీ డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులు సహా సంస్థ ఆస్తులను గుర్తించి వాటిని వేలం వేయాలని స్పష్టం చేసింది. అయితే ఆ ఆస్తులు ఎలాంటి వివాదాల్లో చిక్కుకుని ఉండరాదని పేర్కొంది.
కాగా, విచారణ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్మిశ్రా మాట్లాడుతూ..'ఇళ్లు కొనుక్కోవాలనుకున్న వారిని మీరు మోసం చేశారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల వివరాలను ఇవ్వాల్సిందిగా యునిటెక్ సంస్థనూ ఆదేశించింది.
ఇప్పటికే వీటికి సంబంధించిన వివరాలను సమర్పించినా అవి అసంపూర్ణంగా ఉన్నాయనీ, పూర్తి జాబితాను ఇవ్వాలనీ సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మార్చి 26కు వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో కంపెనీ ఎండీ సంజయ్ చంద్రాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.