యాచకులపై నిషేధం విధించలేం: కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు, కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భిక్షాటన చేసేందుకు ఎవరూ ఇష్టపడరని, పేదరికమే ఆ పరిస్థితి కల్పిస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనావైరస్ మహమ్మారి వేళ బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిసేధం విధించడం కుదరదని స్పష్టం చేసింది. యాచకులకు కరోనా వ్యాక్సిన్లు అందించడంతోపాటు పునరావాసం కల్పించాలని దాఖలైన పిటిషన్ను మంగళవారం విచారించింది.
అంతేగాక, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా విజృంభిస్తున్న వేళ యాచకులు ట్రాఫిక్ జంక్షన్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన చేయడాన్ని అడ్డుకుని, వారికి పునరావాసం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది.
పేదరికమే లేకపోతే ఎవరూ భిక్షాటన చేయాలని కోరుకోరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్య, ఉపాధి లేకపోవడంతోనే కనీస జీవనం కోసం వారు యాచించాల్సి వస్తోందని పేర్కొంది.
ఇదొక సామాజిక-ఆర్తిక సమస్య అని పేర్కొంది. కరోనా మహమ్మారి వ్యాప్తి వేళ బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనను నిసేధించలేదమని సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.