లోన్ మారటోరియం: కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: లోన్ మారటోరియం విషయంలో సుప్రీంకోర్టు.. కేంద్రానికి, భారతీయ రిజర్వు బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రుణాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ రిజర్వు బ్యాంక్ చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై స్పష్టత కోరుతూ సుప్రీంకోర్టు.. కేంద్రం, ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది.
ఈ విషయంపై తమ అభిప్రాయం తెలపాలని కేంద్రం, ఆర్బీఐకి స్పష్టం చేసింది. ఈ ప్రకటన స్థిరాస్థి రంగానికి కూడా వర్తిస్తుందో లేదో వివరించాలని కోరుతూ భారత స్థిరాస్తి రంగ అభివృద్ధి సంస్థ(క్రెడాయ్) దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
క్రెడాయ్ తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఆర్బీఐ ప్రకటన బ్యాంకులన్నింటికీ వర్తించేదిగా ఉండగా, కొన్ని బ్యాంకులు ఈ ప్రయోజనాలను స్థిరాస్తి రంగానికి అందించడం లేదని తెలిపారు.
కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. దీనిపై సంబంధిత విభాగాల నుంచి వివరాలు సేకరిస్తామని సుప్రీంకోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి కొంత ఉపశమనం కల్పించేందుకు ఆర్బీఐ మారటోరియంపై కీలక నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే.