ఫేక్ న్యూస్ కట్టడికి బీజేపీ పిల్ -ట్విటర్, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
టెక్, స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరికీ చేరువైన సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారం, విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు జరుగుతుండటం తరచూ చర్చనీయాంశం అవుతున్నది. సామాజిక మాధ్యమాల్లో విద్వేష వార్తల వ్యాప్తిని నియత్రించేలా పటిష్టమైన వ్యవస్థ తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను వెలువరించింది.
బీజేపీ సీనియర్ నేత వినిత్ గొయాంకా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... ఫేక్ న్యూస్, విద్వేష వ్యాఖ్యల కట్టడి అంశంలో స్పందన తెలియజేయాలంటూ ట్విటర్ ఇండియా, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నకలీ వార్తల వ్యవహారంపై పెండింగ్లో ఇతర పిటిషన్లతో కలిసి దీన్ని విచారిస్తామని సీజేఏ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది.
దేశానికి చెందిన ప్రముఖ వ్యక్తులు, ఉన్నత హోదాల్లో ఉన్నవారి పేర్లతో ట్విటర్, ఫేస్బుక్ మాధ్యమాల్లో వందల కొద్ది బోగస్ ఖాతాలున్నాయని పిటిషనరైన బీజేపీ నేత వినీత్ గొయాంకా పేర్కొన్నారు. ఈ నకిలీ ఖాతాదారులు ప్రముఖుల నిజమైన ఫొటోలను పెట్టి ఆ ఖాతాలను నుంచి మెసేజ్లు చేస్తుండటంతో సామాన్య ప్రజలు వాటిని నమ్ముతున్నారని తెలిపారు. ఈ బోగస్ ఖాతాలు విద్వేషపూరిత, రెచ్చగొట్టే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని, ఢిల్లీ సహా అనేక చోట్ల జరిగే అల్లర్లకు ఈ నకిలీ వార్తలే కారణమని పిటిషన్ లో ఆరోపించారు కాగా,
కేంద్రం దెబ్బకు దిగొచ్చిన ట్విటర్ -97 శాతం ఖాతాలు, పోస్టులపై చర్యలు
ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం ట్విటర్ ఖాతాల్లో 10శాతం, ఫేస్బుక్ ఖాతాల్లో 10శాతం ఖాతాలు బోగస్వేనని, రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఇమేజ్ దెబ్బతీసేందుకు ఈ నకిలీ ఖాతాలను ఉపయోగించుకుంటున్నాయని పిటిషనర్ ఆరోపించారు. ఇలా బోగస్ ఖాతాల ద్వారా నకిలీ వార్తల, విద్వేషపూరిత సందేశాల వ్యాప్తిని నియంత్రించేందుకు సోషల్ మీడియా వేదికలు ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు.