కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో చుక్కెదురు, మంత్రి పదవులు వస్తాయని ఆశ!
న్యూఢిల్లీ: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తిరుగుబాటు చేసి అనర్హతవేటుకు గురైన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో చుక్కెదురైయ్యింది. అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీని అత్యవసరంగా విచారణ చెయ్యడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మంత్రి పదవులు వస్తాయని ఆశ పడిన అనర్హత ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురైయ్యింది.
గత నెల అప్పటి కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ 14 మంది కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేశారు. స్పీకర్ రమేష్ కుమార్ విచారణ చెయ్యకుండా ఏకపక్షంగా తమ మీద అనర్హత వేటు వేశారని ఆరోపిస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
స్పీకర్ రమేష్ కుమార్ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకుల ఒత్తిడితో తమ మీద అనర్హత వేటు వేశారని, ఆయన తీసుకున్న నిర్ణయంతో తమకు అన్యాయం జరిగిందని, వెంటనే అర్జీ విచారణ చేసి తమకు న్యాయం చెయ్యాలని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టుకు మనవి చేశారు.
మంగళవారం ( ఆగస్టు 13వ తేదీ) అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగాయ్ పరిశీలించారు. మీరు సమర్పించిన అర్జీని అత్యవసరంగా విచారణ చెయ్యడం సాధ్యం కాదని, అర్జీని రిజిస్టార్ పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తారని, తరువాత విచారణ చేస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగాయ్ చెప్పారు.
అర్జీని అత్యవసరంగా విచారణ చెయ్యడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు చెప్పడంతో అనర్హత ఎమ్మెల్యేలకు చుక్కెదురైయ్యింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చెయ్యడంతో అప్పటి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అనంతరం కర్ణాటకలో బీఎస్. యడియూరప్ప ముఖ్యమంత్రి (బీజేపీ) అయ్యారు. బీఎస్. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రి పదవులు వస్తాయని అనర్హత ఎమ్మెల్యేలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.