భారత ఆర్మీలో మహిళలకు పర్మినెంట్ కమిషన్ హోదా ఇవ్వండి: ఆర్మీకి సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ : మహిళలు కొన్ని విధులు మాత్రమే చేయగలుగుతారన్న అభిప్రాయం నుంచి బయటకు రావాలని వారికి పర్మినెంట్ కమిషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు భారత ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టు సూచనలను లెక్క చేయని కేంద్రంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాల విషయంలో పురుషులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారో మహిళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
సర్వీసులో 14 ఏళ్లు పూర్తయిన తర్వాత మహిళా ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్ ఇచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించింది ధర్మాసనం. అంతేకాదు పర్మినెంట్ కమిషన్ హోదా ఇచ్చేందుకు 14 ఏళ్లు సర్వీస్ ప్రామాణికత కాదని చెప్పింది సుప్రీంకోర్టు. కాలం మారిందని చెప్పిన సుప్రీంకోర్టు ప్రతి రంగంలో మహిళలు తమను తాము పురుషులతో సమానంగా నిరూపించుకుంటున్నారని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే కెప్టెన్ తాన్యా షెర్గిల్ కెప్టెన్ మధుమితలను గురించి ఉదహరించింది న్యాయస్థానం. ఆర్మీలో నిజమైన సమానత్వం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పింది.
ఇక ప్రభుత్వ కోర్టుకు ఒక నోట్ అందజేసింది. అందులో పలు కారణాలను ప్రస్తావించింది ప్రభుత్వం. మహిళలకు మానసికంగా కొన్ని పరిమితులు ఉంటాయని ,శారీరక పరాక్రమంలాంటి అంశాలు సవాళ్లుగా ఉన్నాయని అందుకే ఆర్మీలో వారికి పర్మినెంట్ కమిషన్ ఇవ్వడంలేదని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇక పురుషులతో పోలిస్తే మహిళలల్లో కొన్ని శారీరకపరమైన అంశాలు, పురుషులతో సమానంగా పనిచేసే సామర్థ్యం సవాలుగా మారుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది . అంతేకాదు కొన్ని సార్లు వీరు శత్రుదేశాలకు యుద్ధ ఖైదీగా పట్టుబడే అవకాశాలున్నాయని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
ఇలా మహిళలను కదనరంగంలోకి దింపడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయని అది ప్రభుత్వానికి మరింత భారమవుతుందని భావించే వారిని ఇలాంటి ఛాలెంజెస్కు దూరంగా ఉంచుతున్నామని చెప్పారు. ఇక ఆర్మీలోని పురుషులు దేశ భద్రత దృష్ట్యా కొన్ని భయానక ప్రాంతాల్లో ఉన్నారని అక్కడ మహిళలను మోహరించడం లాంటివి చేయలేమని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అంతర్గత భద్రత, జమ్మూ కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో పురుషులు అయితేనే విధులను నిర్వహించే పరిస్థితి ఉందని తెలిపింది. అంతేకాదు మహిళకు తల్లి పాత్ర కూడా ప్రధానమైందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
ఇక 14 ఏళ్లు సర్వీసులో పనిచేసిన మహిళలకు మరో ఆరేళ్లు అంటే 20 ఏళ్ల వరకు సర్వీసును పొడిగిస్తామని అయితే ఇక్కడ పర్మినెంట్ కమిషన్ అంటూ ఏమీ ఉండదని కేంద్రం తెలిపింది. మరోవైపు వారికి అన్ని పెన్షన్ బెనిఫిట్స్ వారికి ఇస్తామని తెలిపింది.