ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్లలో కరోనా పరీక్షలు ఉచితంగా చేయండి: కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్లలో కరోనా నిర్ధారణ సహా సంబంధిత పరీక్షలు ఉచితంగా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కరోనా నిర్ధారణ పరీక్షలకు రూ. 4500 ఖర్చవుతుందని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అంతేగాక, ఎన్ఏబీఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్లలో కరోనా పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది.
డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కరోనా పరీక్షల ఫీజుల భారం కాకూడదని.. ఉచితంగానే నిర్వహించేలా రాష్ట్రాలకు కూడా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రానికి తెలిపింది.
అంతేగాక, ప్రైవేటు ల్యాబ్లలో చేసే కరోనా పరీక్షలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే రీఎంబర్స్ చేసే విధానాన్ని పరిశీలించాలని సూచించింది. రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రానికి గడువిస్తూ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలకు రూ. 4500 లను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. 100కు పైగా ప్రభుత్వ, 50కిపైగా ప్రైవేటు ల్యాబ్లలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ల్యాబ్ల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.