కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు ఆదేశాలు, స్పీకర్, ప్రభుత్వానికి నోటీసులు, డెడ్ లైన్!
న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల అర్జీని గురువారం విచారణ చేసిన సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. అదే విదంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ గురువారం సాయంత్రం 6 గంటల లోపు స్పీకర్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యే సమయంలో బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ శుక్రవారానికి (జులై 12వ తేది) అర్జీ విచారణ వాయిదా వేసిందని రెబల్ ఎమ్మెల్యేల తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ కోహటగి మీడియాకు చెప్పారు.
కర్ణాటక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆ లేఖలను స్పీకర్ రమేష్ కుమార్ కార్యాలయంలో అందించారు. రాజీనామా లేఖలు పరిశీలించిన స్పీకర్ రమేష్ కుమార్ ఐదు మంది రాజీనామా లేఖలు చట్టబద్దంగా ఉన్నాయని, 8 మంది రాజీనామాలు చట్టబద్దంగా లేవని స్పష్టం చేశారు.
తాము చట్టబద్దంగా రాజీనామాలు చేసినా స్పీకర్ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని, తమ రాజీనామాలు అంగీకరించడం లేదని ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల అర్జీని విచారణ చేసిన సుప్రీం కోర్టు గురువారం సాయంత్రం 6 గంటల లోపు మీరు స్పీకర్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ముంబైలోని స్టార్ హోటల్ లో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరడానికి సిద్దం అయ్యారు. గురువారం సాయంత్రం 6 గంటలలోపు స్పీకర్ ముందు హాజరై తాము ఎందుకు రాజీనామా లుచేశామో వివరణ ఇస్తామని రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు హెచ్. విశ్వనాథ్ ముంబైలో తనను కలిసిన మీడియాకు చెప్పారు.
రెబల్ ఎమ్మెల్యేల వివరణ ఇచ్చిన తరువాత స్పీకర్ రమేష్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. 13 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి, శివాజీనగర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్, బుదవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంటీబీ, నాగరాజ్, డాక్టర్ కె. సుధాకర్ వారి పదవులకు రాజీనామా చేశారు.