గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్టు: ఆంధ్రాలోకి నో ఎంట్రీ!
న్యూఢిల్లీ: బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ గనుల కేసులో షరతులతో కూడిన జామీను మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బళ్లారి జిల్లాలో అడుగుపెట్టకూడదు. తన మామ అనారోగ్యంతో భాదపడుతున్నారని, చూడటానికి అవకాశం ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన అర్జీ పరిశీలించిన సుప్రీం కోర్టు ఆయన బళ్లారిలో అడుగుపెట్టడానికి శుక్రవారం (జూన్ 7వ తేదీ) అనుమతి ఇచ్చింది.
సుప్రీం కోర్టు ఆదేశం
మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన అర్జీని శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి (వేసవి సెలవుల న్యాయస్థానం) ఇందిరా బెనర్జీ పరిశీలించారు. తన మామ పరమేశ్వర్ రెడ్డి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆయన్ను పరామర్శించడానికి అవకాశం ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో మనవి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో అడుగు పెట్టడానికి అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గాలికి షరతులు
జూన్ 7వ తేదీ నుంచి రెండు వారాల పాటు బళ్లారి జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డి ఉండటానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే రెండు వారాల గడువులో తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్షాలు నాశనం చెయ్యడానికి ప్రయత్నాలు చెయ్యరాదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐకి చివాట్లు
గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన అర్జీ పరిశీలించిన న్యాయస్ధానం అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు సమర్పించిన చార్జ్ షీట్ పరిశీలించారు. కేసు నమోదు అయ్యి ఆరు సంవత్సరాలు అయినా సీబీఐ అధికారులు సంబంధిత పూర్తి చార్జ్ షీట్ సమర్పించడంలో విఫలం అయ్యారని న్యాయస్థానం మండిపడింది.
ఆంధ్రప్రదేశ్ లో నో ఎంట్రీ
అక్రమ గనుల కేసులో మొదటి ఆరోపి అయిన గాలి జనార్దన్ రెడ్డి మూడు సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు. 2015లో సుప్రీం కోర్టులో షరతులతో కూడిన జామీను మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి బళ్లారి జిల్లాలో ప్రవేశించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బళ్లారి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అడుగు పెట్టినా, సాక్షాలు నాశనం చెయ్యడానికి ప్రయత్నించినా జామీను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల ప్రచారం
2016 నవంబర్ 16వ తేదీ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం జరిగింది. ఆ సందర్బంలో వివాహ శుభకార్యం నిర్వహించడానికి నవంబర్ 1 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు బళ్లారి జిల్లాలో తాత్కాలింగా ఉండటానికి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 2018 శాసన సభ ఎన్నికల సందర్బంగా బళ్లారిలో తన సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే శాసన సభ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వలేదు.
సిద్దరామయ్య సవాల్
2018 లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల మధ్య మాటల యుద్దం జరిగింది. కేవలం సిద్దరామయ్య కారణంగా తాను అన్యాయంగా నాలుగు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపానని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డి ఆరోపణలపై వివరణ ఇచ్చిన మాజీ సీఎం సిద్దరామయ్య మీరు చేసిన అవినీతి గురించి చర్చ జరపడానికి తాను సిద్దంగా ఉన్నానని వివరణ ఇచ్చారు. బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి అవకాశం లేని నీవు అవినీతిపై చర్చ జరపడానికి సమయం, తేదీ నీవే నిర్ణయించాలని, తాను వస్తానని మాజీ సీఎం సిద్దరామయ్య మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సవాలు చేశారు.