యడియూరప్ప సీఎం అయ్యారు, సుప్రీం కోర్టులో పాత కేసు విచారణకు ఓకే, అప్పుడే కష్టాలు !
న్యూఢిల్లీ/బెంగళూరు: నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్. యడియూరప్పకు అప్పుడే చిక్కులు మొదలైనాయి. హైకోర్టు నుంచి విముక్తిపొందిన బీఎస్. యడియూరప్ప కేసును మళ్లీ విచారణ చెయ్యడానికి శుక్రవారం సుప్రీం కోర్టు అంగీకరించింది. నాలుగు సంవత్సరాల క్రితం (2015లో) ఈ కేసు విచారణను కర్ణాటక హై కోర్టు రద్దు చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ఈ పాత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యడియూరప్ప సీఎం అయిన రోజే ఆయన 9 సంవత్సరాల పాత కేసు విచారణ చెయ్యడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మళ్లీ విచారణ చెయ్యండి
నాలుగు సంవత్సరాల క్రితం కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన ఈ కేసును మళ్లీ విచారణ చెయ్యాలని సమాజ పరివర్తనా సముదాయ అనే ఎన్ జీఓ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్ జీఓ సంస్థ సమర్పించిన అర్జీని విచారణ చెయ్యడానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించిందని న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ దిన పత్రిక వార్త ప్రచురించింది.
అర్జీ విచారణ తిరస్కరించండి
యడియూరప్ప తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహటగి, మాజీ మంత్రి డీకే. శివకుమార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. 2015 డిసెంబర్ నెలలో కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన ఈ అవినీతి ఆరోపణల కేసు మళ్లీ విచారించడంలో అర్థం లేదని, అర్జీ కొట్టివేయాలని న్యాయవాదులు సుప్రీం కోర్టుకు మనవి చేశారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అర్జీని వెనక్కి తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ విచారణ చెయ్యాలని కోరుతున్న ఎన్ జీఓ సంస్థకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహటగి వాదించారు. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండానే విచారణకు అంగీకరించరాదని న్యాయవాదులు సుప్రీం కోర్టులో వాదించారు.
సీఎం అయ్యారు అందుకే !
సమాజ పరివర్తనా సముదాయ ఎన్ జీఓ సంస్థ తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన మీద ఉన్న ఆరోపణల కేసు విచారణ చెయ్యాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టులో మనవి చేశారు. తాము ఏ వ్యక్తి, సంస్థ ప్రభావానికి లోముకామని, కేసులోని అంశాలు అన్ని పరిశీలించి రెండు వారాల్లో విచారణ చేస్తామని సుప్రీం కోర్టు చెప్పింది.
డీనోటిఫికేషన్ కేసు !
1962లో బీకే. శ్రీనివాస్ అనే వ్యక్తి బెంగళూరులోని బెనగానహళ్ళిలో 5.11 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. తరువాత 4.20 ఎకరాల వ్యవసాయ భూమిలో పరిశ్రమలు నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1986లో ఈ భూమిలో వసతి గృహాలు నిర్మించాలని బెంగళూరు అభివృద్ది ప్రాధికార (బీడీఏ) చట్టం ప్రకారం డీనోటిఫై చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
ట్రబుల్ షూటర్ ఎంట్రీ
కర్ణాటక పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్న ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ఈ భూమి డీనోటిఫై అయ్యిందని పూర్తి సమాచారం ఉన్నా 2003 డిసెంబర్ 18వ తేదీ బీకే. శ్రీనివాస్ కు రూ. 1.62 కోట్లు ఇచ్చి ఆ భూమిని కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇది కర్ణాటక భూస్వాధీనం చట్టానికి వ్యతిరేకమని, సెక్షన్ 3ని ఉల్లంఘించారని, స్వాధీనం చేసుకోవడానికి డీనోటిఫై చేసిన భూమి విక్రయించడం, కొనుగోలు చెయ్యడం నిషేదమి ఈ చట్టం చెబుతోంది.
ఆరోజు యడియూరప్ప సీఎం
మాజీ మంత్రి అయిన డీకే శివకుమార్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఈ భూమిని కొనుగోలు చేశారని, వసతి భవనాలు నిర్మించడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. 2010 మే 13వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సహకారంతో స్వాధీనం చేసుకున్న ఈ భూమికి సంబంధించిన ఆదేశాలను రద్దు చేస్తూ మళ్లీ డీనోటిఫై చేశారని ఆరోపణలు ఉన్నాయి.
అధికార దుర్వినియోగం !
యడియూరప్ప ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ రామనగరకు చెందిన ఆర్ టీఐ కార్యకర్త కబ్బాళేగౌడ ప్రత్యేక అర్జీ సమర్పించారు. తరువాత ఆయన అర్జీని వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి 21వ తేదీన వెనక్కి తీసుకున్న అర్జీ విచారణను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అర్జీ సమర్పించిన వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో రాజీ అయ్యారని, తరువాత ఆ అర్జీ వెనక్కి తీసుకున్నారని ఎన్ జీఓ సంస్థ ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ జరుగుతున్న అర్జీని వెనక్కి తీసుకున్నా ఆ ఫిర్యాదు అలాగే ఉందని, అందుకే ఈ కేసు విచారణ మళ్లీ చెయ్యాలని ఎన్ జీఓ సంస్థ సుప్రీం కోర్టులో మనవి చేసింది. ఈ అర్జీ విచారణతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మళ్లీ కేసు విచారణ ఎదుర్కోవడానికి సిద్దం అయ్యారు.