‘థర్డ్ జెండర్’గా హిజ్రాలకు ప్రత్యేక హక్కులు: సుప్రీం
న్యూఢిల్లీ: సమాజంలో హిజ్రాలను థర్డ్ జండర్గా గుర్తించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. హిజ్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని సుప్రీం కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. లింగమార్పిడి చేయించుకున్న వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని, విద్య, ఉపాధిలో సమాన హక్కులు కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
హిజ్రాలకు సమాన హక్కులు కల్పించాలన్న పిటిషన్పై మంగళవారం ఉదయం విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పును ప్రకటించింది. హిజ్రాలపట్ల వివక్షపై సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. హిజ్రాలను థర్డ్ జెండర్గా గుర్తించడం వల్ల వారికి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సమాన అవకాశాలు లభ్యమవుతాయని కోర్టు అభిప్రాయపడింది.
కాగా, ఇప్పటి వరకు రెండు జెండర్(ఆడ, మగ)లే అమలులో ఉండగా, తొలిసారి మూడవ జెండర్ను సుప్రీం కోర్టు గుర్తించింది. మూడవ జెండర్కు వారు ఇతర వెనకబడిన తరగతుల కిందకు వస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోర్టు ప్రభుత్వాలను ఆదేశించింది. లింగమార్పిడి చేయించుకున్న వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని కోర్టు కూడా సూచించింది.