జియోకు విక్రయం: సుప్రీంకోర్టులో ఆర్కాంకు చుక్కెదురు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆర్కామ్ ఆస్తులను రిలయన్స్ జియోకు విక్రయించకుండా బాంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై మళ్లీ విచారణ జరిపేంత వరకు బాంబే హైకోర్టు తీర్పు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 5కు వాయిదా వేసింది. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఆర్కామ్ ఆ భారాన్ని తగ్గించుకునేందుకు తన ఆస్తులను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు విక్రయిస్తున్నట్లు గత డిసెంబరులో ప్రకటించింది. ఈ మేరకు అంబానీ సోదరులు అనిల్, ముఖేశ్ల మధ్య ఒప్పందం కుదిరింది.
అయితే దీనిపై ఎరిక్సన్ సంస్థ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లింది. తమ బకాయిలు చెల్లించకుండా ఆస్తులు విక్రయిస్తున్నారని ఆరోపించింది. దీంతో అనుమతులు లేకుండా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులు అమ్మరాదని ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆర్బిట్రేషన్ తీర్పుపై ఆర్కామ్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా సంస్థకు నిరాశే ఎదురైంది.
ఆస్తులు విక్రయించకుండా హైకోర్టు స్టే విధించింది. తాజాగా ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చింది. కాగా, స్టే ఎత్తి వేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం కూడా నిరాకరించడంతో ఆర్కామ్ మళ్లీ చిక్కుల్లో పడింది. కాగా, ఈ తీర్పు నేపథ్యంలో ఆర్కామ్ షేర్లు భారీగా నష్టపోయాయి.