ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టసవరణ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్ట సవరణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. గతేడాది మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వచ్చిన రివ్యూ పిటిషన్లను, రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఒకేసారి విచారణ చేస్తామని వెల్లడించింది. వీటిపై మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఒక ఫిర్యాదు చేస్తే ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేయరాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు చెప్పింది. అంతేకాదు ముందస్తు బెయిలు కూడా పొందే అవకాశం ఉందంటూ పేర్కొంది. అయితే దేశవ్యాప్తంగా దళిత సంఘాలు భగ్గుమన్నాయి. హింస చెలరేగడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దీనిపై పార్లమెంటు చట్టసవరణ చేస్తూ ముందస్తు బెయిలు అంశాన్ని తొలగించింది. అంతేకాదు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసేందుకు ఎలాంటి విచారణ అక్కర్లేదని పార్లమెంటు అభిప్రాయపడింది.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని అభిప్రాయపడుతూ సర్వోన్నత న్యాయస్థానం గతేడాది మార్చి 20న తీర్పువెల్లడించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఎవరైనా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు ముందుగా విచారణ చేపట్టాలని, తప్పని తేలితేనే అరెస్టు చేయాలంటూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది.