జల్లికట్టు: తమిళనాడుకు నోటీసులు ఇచ్చిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: జల్లికట్టు వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జల్లికట్టు నిర్వహించాలని జరిగిన ఆందోళనలో హింస చోటు చేసుకుందని, అయినా మీరు శాంతి భద్రతలు కాపాడటంలో ఎందుకు విఫలం అయ్యారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
జల్లికట్టు ఆందోళన హింసాత్మకంగా మారిపోవడానికి అసలుకారణాలు ఏమిటి ? చెన్నై నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అల్లర్లు జరిగాయి ? అందుకు ఎవరు బాధ్యులు ? అని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. జల్లికట్టు క్రీడను రద్దు చెయ్యాలని జంతు హక్కుల సంఘాలు సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. మంగళవారం ఈ అర్జీ పరిశీలించిన సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అయ్యింది అని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదే విధంగా జల్లికట్టు నిర్వహించాలని తమిళనాడు అసెంబ్లీలో ఎలా తీర్మానం చేశారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.