అంతకుమించి: మహాత్మాగాంధీకి భారతరత్న: పిల్ దాఖలు..కొట్టేసిన సుప్రీంకోర్టు..!
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీకి మనదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. మహాత్మా గాంధీ.. భారతరత్న కంటే మహోన్నతుడని పేర్కొంది. జాతిపితకు మించిన అత్యున్నత పురస్కారం ఇంకేం ఉంటుందని వ్యాఖ్యానించింది. కొత్తగా ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం సరికాదని అభిప్రాయపడింది.
మహాత్మాగాంధీకి భారతరత్న అవార్డును ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పిటీషన్పై విచారణ ఆరంభించిన కొద్ది సేపటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మహాత్ముడికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలనేది విధానపరమైన నిర్ణయమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
Petitioner wants Maharma Gandhi to be honoured with something unique, something more than Bharat Ratna. SC says “we agree with you & share your sentiment, but can’t allow this petition. Give representation to government”. @IndianExpress
— Ananthakrishnan G (@axidentaljourno) January 17, 2020
మహాత్ముడు భారతరత్న పురస్కారానికి ఎన్నో రెట్లు మించిన మహోన్నతుడని ధర్మాసనం పేర్కొంది. దేశం యావత్తూ ఆయనను జాతిపితగా గౌరవిస్తోందని, ఇలాంటి సందర్భంలో భారతరత్నను ప్రకటించడం సరికాదని అభిప్రాయపడింది. పిటీషనర్ మనోభావాలు, సెంటిమెంట్ను తాము అర్థం చేసుకోగలమని, అయినప్పటికీ దీనిపై నిర్ణయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటీషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.