స్పీకర్కు షాక్: హైకోర్టు ఆదేశాలపై స్టేకి సుప్రీం నో: అంతమాత్రానికే ఎమ్మెల్యేల అనర్హతా?
న్యూఢిల్లీ: రాజస్థాన్లో నెలకొన్న పొలిటికల్ హైడ్రామా మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ లేవనెత్తిన తిరుగుబాటు వ్యవహారంతో రాజస్థాన్ ప్రభుత్వంలో చెలరేగిన వివాదాలు యధాతథంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సచిన్ పైలట్పై రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్పై హైకోర్టులో ప్రతికూల ఫలితమే వెలువడిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాజస్థాన్ స్పీకర్కు ఎదురుదెబ్బ తగిలింది. సచిన్ పైలెట్, ఆయన వర్గానికి చెందిన 18 తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది.
హైకోర్టు ఆదేశాలపై స్టేకు నిరాకరణ..
సచిన్ పైలెట్ విషయంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీనితో సచిన్ పైలెట్కు సుప్రీంకోర్టులో ఊరట కల్పించినట్టయింది. అదే సమయంలో- రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు యధాతథంగా కొనసాగవచ్చని అంటున్నారు. సచిన్ పైలట్పై ఎలాంటి చర్యలను తీసుకోకుండా హైకోర్టు విధించిన గడువు శుక్రవారం నాటితో ముగియబోతోంది. దీని తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారిందక్కడ.
హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీం..
సచిన్ పైలెట్, ఆయన వర్గానికి చెందిన 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలను తీసుకోకూడదంటూ కొద్దిరోజుల కిందటే రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ స్పీకర్ సీపీ జోషి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. ఇది గురువారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ స్పెషల్ లీవ్ పిటీషన్పై విచారించింది. సచిన్ పైలెట్ సహా 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విధించిన అనర్హత వేటును నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ ధర్మాసనం సమర్థించింది.
అందుబాటులో లేని సచిన్..
స్పీకర్ సీపీ జోషి తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్, కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబల్ తన వాదనలను వినిపించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని సచిన్ పైలెట్ వర్గం కూలదోయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన సచిన్ పైలెట్.. ప్రస్తుతం సొంత పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి అందుబాటులో లేకుండా పోయారని అన్నారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆయను ఇమెయిల్ ద్వారా నోటీసులను పంపించిందని, దానికి కూడా బదులు ఇవ్వట్లేదని అన్నారు.
వారి గొంతును నొక్కలేం..
లక్షలమంది ప్రజలు ఎన్నుకోవడం వల్లే వారంతా చట్టసభలకు ఎన్నికయ్యారని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజల తరఫున ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న సభ్యుల గొంతును నొక్కలేమని పేర్కొంది. పార్టీ సమావేశాలకు గానీ, పార్టీ నేతలకు గానీ అందుబాటులో లేనంతమాత్రాన ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను అనర్హుడిగా గుర్తించాలా? అని అరుణ్ మిశ్రా ఎదరు ప్రశ్నలు వేశారు. పార్టీ నేతలపై తిరుగుబాటు లేవనెత్తిన వారి డిమాండ్లను వినకూడదా? అని నిలదీశారు. ఇలా ప్రశ్నించిన వారిపై అనర్హత వేటు వేస్తూ వెళితే..ప్రశ్నించే గళం వినిపించకపోవచ్చని అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు.
Recommended Video
అనర్హత వేటుపై హైకోర్టును ఆశ్రయించిన సచిన్..
సచిన్ పైలట్ సహా ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై స్పీకర్ అనర్హత వేటు వేయగా.. వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ వరకు సచిన్ పైలట్, ఆయన వర్గ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.