ఆర్టికల్ 370కి సంబంధించిన పిటిషన్ల విచారణకు విస్తృతస్థాయి ధర్మాసనం అక్కర్లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గతేడాది ఆగష్టులో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంకు సంబంధించిన పిటిషన్ను విస్తృతస్థాయి ధర్మాసనం విచారణ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనమే విచారణ చేస్తుందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి విస్తృత స్థాయి ధర్మాసనం విచారణ చేయాలంటూ దాఖలైన పిటిషన్లు అన్నిటినీ ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేస్తుందని వెల్లడించింది.
జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన పిటిషన్లను విచారణ చేస్తుందని క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. పీపుల్స్ యూనియన్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీఓ సంస్థతో పాటు జమ్మూ కశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్, మరో వ్యక్తి ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని చెబుతూ దాన్ని పిటిషన్ను విస్తృతస్థాయి ధర్మాసనం విచారణ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రెండు తీర్పులను పిటిషన్లో ప్రస్తావించింది. ప్రేమ్నాథ్ కౌల్ వర్సెస్ జమ్మూ కశ్మీర్ 1959, సంపత్ ప్రకాష్ వర్సెస్ జమ్మూకశ్మీర్ 1970లో ఆర్టికల్ 370 గురించి విచారణ చేసిందని ఆ సందర్భంగా పిటిషన్లను విస్తృతస్థాయి ధర్మాసనంకు బదిలీ చేసిందని పిటిషన్లో గుర్తుచేశాయి. ఇక తాజా పిటిషన్ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుభాష్ రెడ్డి, బీఆర్ గవాయ్ మరియు సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే పిటిషనర్లు ప్రస్తావించిన గత రెండు అంశాలు ఒకదానితో మరొకదానికి సంబంధం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్