సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ప్రారంభం: ఈ నెలలో అతిముఖ్యమైన కేసుల విచారణ
ఢిల్లీ: శీతకాలం సెలవుల తర్వాత సుప్రీం కోర్టు నేడు పునఃప్రారంభమైంది. సోమవారం తెరుచుకున్న సుప్రీంకోర్టు ముందుకు పలు ప్రాధాన్యత ఉన్న పిటిషన్లు న్యాయస్థానం ముందుకు రానున్నాయి. ఇందులో ముందుగా టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేసిన పిటిషన్ బెంచ్ ముందుకు రానుంది. సైరస్ మిస్త్రీని తిరిగి గ్రూప్ డైరెక్టర్గా నియమించాలన్న ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం రోజు అది విచారణకు రానుంది.
శబరిమల కేసును విచారణ చేయనున్న విస్తృతస్థాయి ధర్మాసనం
జనవరి నెలలోనే శబరిమలపై తీర్పు రానుంది. శబరిమల అంశాన్ని ఏడుగురు సభ్యుల విస్తృత స్థాయి బెంచ్కు బదిలీ చేశారు అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్. నవంబర్ 14 ఇచ్చిన తీర్పులో శబరిమల అంశంపై నిర్ణయం విస్తృత స్థాయి బెంచ్ వెల్లడిస్తుందని చెప్పారు. అయితే ఒక్క శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం ఉండరాదని చెబితే ఆ ప్రభావం ఇతర మతాలపై కూడా పడుతుందని భావించిన ధర్మాసనం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు విస్తృత స్థాయి బెంచ్కు బదిలీ చేసింది.
పౌరసత్వ సవరణ చట్టం పిటిషన్ విచారణ
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పొరుగు దేశాల్లో మతపరమైన అణిచివేతకు గురై భారత్కు శరణార్థులుగా వచ్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఇందులో ముస్లింయేతర మతాల వారికి మాత్రమే భారత పౌరసత్వం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ చట్టంపై స్టే ఇవ్వాలని పిటిషన్లు దాఖలు కాగా, అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అదే సమయంలో రాజ్యాంగ ప్రామాణికతను కూడా సమీక్షిస్తామని చెబుతూ కేంద్రం దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసును ఈ నెల 22కు వాయిదా వేసింది.
ఆర్టికల్ 370 రద్దు, ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్పై విచారణ
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారణ చేయనుంది. గతేడాది డిసెంబర్ 11న కేసు న్యాయస్థానం ముందుకు రాగా దీన్ని జనవరి నెలలో విచారణ చేస్తామని పేర్కొంది. మరోవైపు డిసెంబర్ 4వ తేదీన ఎలక్టోరల బాండ్ల పథకంపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ను జనవరి నెలలో విచారణ చేయనుంది సుప్రీంకోర్టు. ఈ స్కీమ్ ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో కార్పొరేట్ కంపెనీలు భారీగా నిధులు ఇవ్వడాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ తరపున వాదిస్తున్న ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యంకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పిటిషన్లో తెలిపారు.